కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు వస్తానని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు కోసం తాను తెలంగాణ భవన్లో కుర్చీ వేసి, శాలువాతో మరీ వేచి చూస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. చర్చకు వస్తానన్న మంత్రి ఎటు వెళ్లిపోయారో సమాధానం చెప్పాలన్నారు. తాము గన్పార్క్ వద్దకైనా చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ అక్కడికి వెళ్తామంటే పోలీసులు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో తాము వేచి ఉన్నా కాంగ్రెస్ నేతలు తోకముడిచారని, అక్కడెక్కడో కూర్చొని తొడలు కొడితే ప్రయోజనం లేదని విమర్శించారు. ఇదే క్రమంలో బీజేపీ నేతలపై కూడా విరుచుకుపడిన కేటీఆర్.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై జరిగిన ఈడీ విచారణ ఏమైందో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 'ఆర్ఆర్' టాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా ప్రధాని మోదీ చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని మరియు అమృత్ టెండర్లలో జరిగిన అవినీతిపై ఎందుకు విచారణ జరపడం లేదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.
No comments:
Post a Comment