- జంతర్ మంతర్ లేదా తటస్థ వేదిక వద్దే కలవాలని ప్రభుత్వానికి సీజేపీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ:పోటీ పరీక్షల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై కొనసాగుతున్న నిరసనలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ఈ సంప్రదింపులు జంతర్ మంతర్ వద్ద లేదా దానికి దగ్గరలోని ఏదైనా తటస్థ ప్రాంతంలోనే జరగాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తమను చర్చలకు రమ్మని తన నివాసానికి ఆహ్వానించారని, కానీ ప్రజా సమస్యలపై మంత్రులే ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాలని ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ వెల్లడించారు. భద్రతా పరమైన కారణాలు ఉంటే జంతర్ మంతర్ సమీపంలోని తటస్థ ప్రదేశంలోనైనా కలవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం అందించాలని, శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని సీజేపీ మరోసారి డిమాండ్ చేసింది. దీంతోపాటు ఉద్యమంలో పాల్గొన్న నిరసనకారులపై ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోబోమని కేంద్రం నుండి స్పష్టమైన హామీ కావాలని కోరింది. ఢిల్లీతో పాటు ముంబై, గోవా, జైపూర్ వంటి పలు నగరాలకు ఈ ఉద్యమం విస్తరించిందని, విద్యార్థుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను ఆమోదించాలని సీజేపీ డిమాండ్ చేసింది.
No comments:
Post a Comment