- అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో తప్పిన ముప్పు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక నివాసంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మదర్ థెరిసా క్రెసెంట్ రోడ్డులోని ఆయన ఇంటిలో ఒక గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ టెండర్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గదిలోని ఫర్నిచర్కు మంటలు అంటుకోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో రవిశంకర్ ప్రసాద్ ఇంట్లోనే ఉన్నారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే మంటలను ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.
No comments:
Post a Comment