- భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం
- భారత గణతంత్ర వేడుకల వేళ జిన్పింగ్ కీలక సందేశం
భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆసక్తికరమైన సందేశాన్ని పంపారు. ఆసియాలోని రెండు అగ్రరాజ్యాలైన చైనా (డ్రాగన్), భారత్ (ఏనుగు) పరస్పర విరోధాన్ని వీడి కలిసి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ - చైనాలు కేవలం పొరుగు దేశాలు మాత్రమే కాదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలని పేర్కొంటూ.. ఈ రెండు దేశాలు పోటీ పడటం కంటే సహకరించుకోవడం ద్వారా ప్రపంచ స్థిరత్వానికి, ఆర్థిక వృద్ధికి తోడ్పడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. పరస్పర ప్రయోజనాలు, గౌరవంతో కూడిన బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలని, అప్పుడే ఆసియా శతాబ్దం కల నిజమవుతుందని జిన్పింగ్ తన సందేశంలో ఉద్ఘాటించారు.
కొన్నేళ్లుగా సరిహద్దు వివాదాల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో, జిన్పింగ్ పంపిన ఈ సానుకూల సందేశం దౌత్య వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల మధ్య భారత్ - చైనా మధ్య సంబంధాల పునరుద్ధరణ అవసరమని, ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో కలిసి పనిచేయడం ద్వారా ఇరు దేశాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ సాధిస్తున్న ప్రగతిని అభినందిస్తూ, రాబోయేకాలంలో ఇరు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలవుతుందని చైనా అధ్యక్షుడు ఆకాంక్షించారు.
No comments:
Post a Comment