- దేశ ఆర్థిక గమనాన్ని ఆవిష్కరించనున్న నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెట్టడానికి ముందు అత్యంత కీలకమైన అడుగు పడబోతున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (జనవరి 29, గురువారం) లోక్సభలో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన ప్రగతి, ఎదుర్కొన్న సవాళ్లు మరియు భవిష్యత్తు అంచనాలను ఈ సర్వే వివరిస్తుంది. ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) డాక్టర్ వి. అనంత నాగేశ్వరన్ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఈ నివేదిక, ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్కు దిశానిర్దేశంలా పనిచేస్తుంది.
ఈ సర్వేలో దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం పరిస్థితి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల పనితీరుపై లోతైన విశ్లేషణ ఉండనుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య ఆంక్షల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు నిలకడగా ఉందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఉదయం 11 గంటలకు మంత్రి పార్లమెంట్లో సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం, ప్రధాన ఆర్థిక సలహాదారు మీడియా సమావేశం నిర్వహించి కీలక గణాంకాలను వివరించనున్నారు. ఈసారి సర్వేలో కృత్రిమ మేధ (AI) వల్ల ఉద్యోగ రంగంలో వచ్చే మార్పులు, తయారీరంగం బలోపేతం వంటి అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
బుధవారం (జనవరి 28) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు, నేటి ఆర్థిక సర్వేతో కీలక దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం అయినప్పటికీ, నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులపై స్పష్టమైన చిత్రాన్ని ఇచ్చే ఈ సర్వే ఆధారంగానే, రాబోయే బడ్జెట్లో సామాన్యులకు లభించే ఊరట లేదా కొత్త పథకాలపై ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.
No comments:
Post a Comment