Tuesday, 2 June 2026

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

 ఇరాన్ యుద్ధ సెగ

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

రూపాయి విలువపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక విశ్లేషణ!

అంతర్జాతీయంగా ఇరాన్ సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు మండుతుండటం, ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ పడిపోతుండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ డి. సుబ్బారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2013 నాటి కరెన్సీ సంక్షోభ కాలంతో పోలిస్తే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని, అప్పట్లో లాగా భారత్ ఇప్పుడు బలహీనమైన దేశాల జాబితాలో లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీటీవీ (NDTV) ప్రతినిధి గౌరీ ద్వివేదితో మాట్లాడిన ఆయన, డాలర్‌తో రూపాయి మార్పిడి విలువను మార్కెట్శక్తులకే వదిలేయాలని, దానిని కట్టడి చేయడానికి ఆర్బీఐ భారీగా నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ ఆయిల్ సరఫరాలో 20 శాతానికి పైగా వాటా ఉన్న హార్ముజ్ జలసంధి వద్ద పదే పదే అంతరాయాలు కలగడం వల్ల బ్రెంట్ క్రూడ్ ధరలు ఫిబ్రవరి నాటికంటే 30 శాతం పెరిగి, గరిష్టంగా బ్యారెల్‌కు 110 డాలర్ల పైకి చేరడం ప్రపంచవ్యాప్తంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచిందని ఆయన పేర్కొన్నారు.



ప్రస్తుతం డాలర్‌తో రూపాయి విలువ దాదాపు 7 శాతం క్షీణించి ఒక దశలో 97 మార్కును తాకినప్పటికీ, దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని సుబ్బారావు గుర్తుచేశారు. ముడిచమురు ధరల పెరుగుదల వల్ల దేశ చాల్తీ ఖాతా లోటు (Current Account Deficit) జీడీపీలో గత ఏడాది ఉన్న 1 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగే అవకాశం ఉన్న మాట నిజమేనని, అయితే ఈ లోటును పూడ్చడానికి రూపాయి విలువ సహజంగానే తగ్గడం (డిప్రిసియేషన్) అవసరమని ఆయన విశ్లేషించారు. ఆర్బీఐ కేవలం మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాలే తప్ప, బలవంతంగా రూపాయి విలువను పెంచాలని చూస్తే అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని హెచ్చరించారు. 2013లో భారత్ తీవ్ర ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధి రేటు, పాలనాపరమైన పక్షవాతం (Policy Paralysis) వంటి సమస్యలతో 'ఫ్రైజైల్ ఫైవ్' (Fragile Five - ఐదు బలహీన ఆర్థిక వ్యవస్థలు) లో ఒకటిగా ఉండేదని, కానీ ఇప్పుడు మన దేశ వృద్ధి రేటు బాగుందని, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, అన్నింటికీ మించి మన విదేశీ మారక నిల్వలు (Forex Reserves) రికార్డుస్థాయిలో 700 బిలియన్ డాలర్లకు చేరువలో ఉన్నాయని ఆయన వివరించారు.


అయితే, ముడిచమురు ధరలు ప్రతీ 10 డాలర్లు పెరిగినప్పుడల్లా దేశ ఆర్థికవృద్ధి 20 నుండి 30 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని, ద్రవ్యోల్బణం 30 నుండి 40 బేసిస్ పాయింట్లు పెరుగుతుందని ఆర్బీఐ అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో వృద్ధిని కాపాడుకుంటూనే, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం మరియు రూపాయిని స్థిరపరచడం అనే ఒక అసాధ్యమైన సవాల్‌ను (Impossible Trinity) కేంద్ర బ్యాంకు ఎదుర్కొంటోందని చెప్పారు. దిగుమతులను తగ్గించడానికి బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం, ఎక్సైజ్ సుంకం తగ్గించి ఇంధన ధరల భారాన్ని ప్రభుత్వం పంచుకోవడం వంటి చర్యలను ఆయన అభినందించారు. ఇంధన ధరలను పెంచడం రాజకీయంగా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ, ఇలాంటి సంక్షోభ సమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకే ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని పరోక్షంగా ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించారు. మున్ముందు చమురు ధరలు సగటున 90 డాలర్ల వద్ద ఉన్నా సవాలు తప్పదని, భవిష్యత్ భౌగోళిక రాజకీయ అనిశ్చితిని తట్టుకోవడానికి భారత్ కేవలం వృద్ధి పైనే కాకుండా వ్యూహాత్మక ఇంధన నిల్వలను (Strategic Energy Reserves) పెంచుకుంటూ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతపై దృష్టి పెట్టాలని సుబ్బారావు సూచించారు.


ndtv.com సౌజన్యంతో..

తెలంగాణలో పోటీ చేస్తాం



ప్రాంతీయ విద్వేషాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిప్పులు

రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా?



హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని, రాబోయే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా బరిలోకి దిగుతామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తెలంగాణ కూడా భారతదేశంలో ఒక భాగమేనని, ఇక్కడి ప్రతి సమస్యపై తాను స్వయంగా పర్యటించి గళం విప్పుతానని, ఏ అన్యాయం జరిగినా నిలదీస్తానని ఆయన ప్రకటించారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయ విద్వేషాలు చాలా ప్రమాదకరమైనవని హెచ్చరించిన పవన్ కల్యాణ్, తెలంగాణకు రావద్దని చెప్పడానికి అసలు మీరెవరని, తెలంగాణ ఎవరికైనా వ్యక్తిగత జాగీరా అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది భారతదేశమని, దేశంలో తాను ఏ ప్రాంతానికైనా ప్రయాణించవచ్చని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి ప్రవేశించడానికి తనకు ఏమైనా పాస్‌పోర్ట్ అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. తాను ఇప్పటివరకు అనుకోలేదని, కానీ ఇప్పుడు చెబుతున్నాను. తెలంగాణలో జనసేన ఉంటుంది. తాము పోటీ చేస్తామన్నారు. అట్లనే తాను తెలంగాణ అంతటా తిరుగుతానని, సమస్యలపై పోరాడాతాను అన్నారు 


పాలకుల ఆలోచనలు, ప్రజల మనోభావాలు వేర్వేరుగా ఉంటాయని చెబుతూ, తెలుగు మాట్లాడే రెండు రాష్ట్రాల సమాజాల మధ్య అనవసరమైన విభేదాలను రెచ్చగొట్టవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) పరిపాలన సాగిన సమయంలో కూడా తాను తెలంగాణకు వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని, అనవసరమైన ఘర్షణలను సృష్టించడంపై తనకు నమ్మకం లేదని పవన్ స్పష్టం చేశారు. గత 12 ఏళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులను, విమర్శలను ఓపికగా భరించానని, ఇలాంటి బెదిరింపులకు తాను ఎంతమాత్రం భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇక తనపై వస్తున్న భూఆక్రమణల ఆరోపణలపై స్పందిస్తూ, తాను గనుక ఏదైనా చెరువును అక్రమంగా ఆక్రమించుకున్నట్లు నిరూపిస్తే, ఆ భూమిని తక్షణమే ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నానని పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు.

ఇరాన్ మోకాళ్లపై పడ్డా అమెరికాదే ఓటమి అంటారు



  • డెమొక్రాట్లు, మీడియాపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమాసియా  సంక్షోభంపై అమెరికా ప్రధాన స్రవంతి మీడియా, డెమొక్రాటిక్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకవేళ ఇరాన్ దేశం అమెరికా ముందు పూర్తిగా మోకాళ్లపై పడి, లొంగిపోయినట్లు ప్రకటించినా సరే, ఇక్కడ ఉన్న మీడియా, డెమొక్రాట్లు దానిని ఇరాన్ సాధించిన అద్భుత విజయంగానే చిత్రీకరిస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో పెట్టిన పోస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులు, మీడియా సంస్థలు తన పరిపాలనపై తీవ్ర పక్షపాతంతో వ్యవహరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇరాన్ సైన్యం తన ఆయుధాలను కిందపడేసి, తెల్లజెండా ఊపుతూ చేతులెత్తి తాము లొంగిపోతున్నామని టెహ్రాన్ వీధుల్లో కేకలు వేసినా, వారి నావికాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందని అంగీకరించినా సరే.. ఇక్కడి విపక్షాలు మారవని ట్రంప్ పేర్కొన్నారు. 'ది ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్', 'ది చైనా స్ట్రీట్ జర్నల్' (వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉద్దేశిస్తూ), 'టోటల్ అవినీతిమయమైన సీఎన్‌ఎన్' వంటి సంస్థలు ఇరాన్‌దే పైచేయి అయిందంటూ తప్పుడు కథనాలను ప్రముఖంగా ప్రచురిస్తాయని మండిపడ్డారు. డెమొక్రాట్లను 'డుమాక్రాట్లు' (Dumacrats) అని సంబోధిస్తూ, వారంతా పూర్తిగా పిచ్చివాళ్లయిపోయారని, విచక్షణ కోల్పోయారని మండిపడ్డారు. ఇరాన్‌తో శాంతి చర్చలు వేగంగా సాగుతున్నాయని, తాము అనుకున్న విధంగానే అగ్రరాజ్య వ్యూహాలు ఫలించబోతున్నాయని చెబుతూనే, మీడియా దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

కొత్త దారి వెతుకుతున్న ‘సింగం’



  • బీజేపీ వీడే యోచనలో అన్నామలై
  • ఢిల్లీలో హైకమాండ్‌తో భేటీ

తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్‌లతో కీలక భేటీలు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పార్టీకి తన రాజీనామా లేఖను సమర్పించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా , తమిళనాడులో మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, బీజేపీలో తనకు భవిష్యత్తు లేదని భావిస్తున్నట్లు ఆయన అధిష్ఠానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో పార్టీ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. ఇకపై రాజకీయంగా తన సొంత దారిని ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు ఆయన అగ్రనాయకత్వానికి తెలియజేశారు. అయితే, మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైని పార్టీలోనే కొనసాగేలా చూసేందుకు అధిష్ఠానం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయస్థాయిలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై స్పందించిన అన్నామలై, మరో రెండు రోజుల్లో తన భవిష్యత్తు కార్యాచరణ , తదుపరి రాజకీయ అడుగులపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. తమిళనాడులో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో, ఆయన ఒక నూతన ప్రాంతీయ పార్టీని లేదా జాతీయ భావజాలంతో కూడిన ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

ఆలస్యమైనా అంకితభావానికే దక్కిన పీఠం



  • కర్ణాటక కు కాబోయే సీఎం డీకే శివకుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు

బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి చేపట్టడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అత్యంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం తనను సీఎంగా ప్రకటించిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. తనకు ఈ పదవి దక్కడం కొంత ఆలస్యమై ఉండవచ్చు కానీ, ఎన్నడూ తిరస్కరణకు గురికాలేదని స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, ఇది తన వ్యక్తిగత విజయం కాదని, ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్తకు దక్కిన గౌరవమని అభివర్ణించారు. 1979లో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం ప్రారంభించిన తాను, దశాబ్దాలుగా నమ్ముకున్న సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని గుర్తుచేశారు. తన ఎదుగుదల వెనుక పార్టీ కార్యకర్తల నిరంతర శ్రమ, అండదండలు ఉన్నాయని డీకే శివకుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను క్రమశిక్షణతో నెరవేర్చానని చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పుపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరదించుతూ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వేళ, కార్యకర్తల ఉత్సాహాన్ని తాను అర్థం చేసుకోగలనని, అయితే వేడుకలను హద్దుల్లో ఉంచుకుని ప్రజాసేవకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఆయన వెల్లడించారు.


నా తెలంగాణ ఒక చరిత్ర

అరవై ఏండ్ల పోరాటం.. అమరుల త్యాగఫలం ఫలితం తెలంగాణ రాష్ట్రం. దేశంలో ఇప్పటివరకు ఏర్పడిన రాష్ట్రాల కంటే తెలంగాణకు భిన్నమైన చరిత్ర ఉన్నది. స్వతంత్య్రం ఏర్పడే నాటికి దేశంలో కలిసిన అనేక సంస్థానాల్లో హైదరాబాద్‌ అప్పటికే అభివృద్ధి చెంది ఉన్నది. ప్రపంచంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అట్లా అన్నిరంగాల్లో ముందున్న  హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపారు. ఒప్పందాల ప్రాతిపదికన ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు భావ సారూప్యత లేదు. సాంస్కృతికంగా కూడా ఈ రెండు ప్రాంతాలు చాలా భిన్నమైనవి. తెలుగు మాట్లాడేవారంతా ఒక్కటే అనే పిడివాదం తప్ప తెలంగాణకు ఆంధ్రాకు ఎప్పుడూ పోలిక లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రంతో విలీనాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకించారు. ఫజల్‌ అలీ కమిషన్‌ కూడా 1962 సార్వత్రిక ఎన్నికల నాటి వరకు వాయిదా ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కానీ ఆంధ్ర నేతల లాబీయింగ్‌ కు తలొగ్గిన నాటి నెహ్రూ ప్రభుత్వం కండీషన్ల మీద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది.  ఆంధ్ర రాష్ట్రంతో కలుపవద్దని తెలంగాణ వాదులు ఎందుకు అన్నారో త్వరగానే తేలిపోయింది. ఒప్పందాలన్నీ తుంగలో తొక్కారు. ఇక్కడి నిధులు, నీళ్లు, నియామకాలు కొల్లగొట్టారు. రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. అందుకే 1969 నాటికి మా రాష్ట్రం మాగ్గావాలె అని ఉవ్వెత్తున్న ఉద్యమం ఎగిసిపడింది. ఉద్యమాన్ని అణిచివేయడానికి నాటి కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 369 మందిని కాల్చివేసింది. 



ముల్కీ రూల్స్‌ చారిత్రక తీర్పులు




1969 జై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన తొలిరోజుల్లో, స్థానికత రక్షణలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969 జనవరి 21న ప్రతిష్టాత్మకమైన జీఓ నంబరు 36ను జారీ చేసింది. అయితే, ఈ జీఓ వెలువడక ముందే విద్యుత్ మండలి (APSEB) నియామకాలకు ముల్కీ నిబంధనలు వర్తించవని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కుప్పుస్వామి తీర్పునివ్వడం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు జీఓ 36 రాజ్యాంగబద్ధతను సవాలు చేయగా, హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఓ. చిన్నపరెడ్డి ఆ జీఓ చెల్లదంటూ కొట్టివేశారు. అంతేకాకుండా, తెలంగాణ వారికి ఉద్యోగ రక్షణలు కల్పించిన 1957 నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్టంలోని సెక్షన్ 3 రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(3)కి విరుద్ధమని, ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే ప్రత్యేక నివాస అర్హతలు కల్పించడం కుదరదని స్పష్టం చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు చేయగా, జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి మరియు జస్టిస్ ఆవుల సాంబశివరావులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ చట్టాన్ని సమర్థిస్తూ జీఓ 36 రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందని తీర్పునిచ్చి తాత్కాలిక ఉపశమనం కలిగించింది.


కాని ఈ వివాదం అంతటితో ముగిసిపోలేదు; ఎ.వి.ఎస్. నర్సింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో ఈ జీఓను సుప్రీంకోర్టులో సవాలు చేయగా, 1969 మార్చి 28న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిదయతుల్లా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జీఓ 36ను, 1957 చట్టంలోని సెక్షన్ 3ను రాజ్యాంగ విరుద్ధమంటూ పూర్తిగా రద్దు చేసింది. దీనితో తెలంగాణలో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవగా, 1970 డిసెంబరు 9న పి. లక్ష్మణరావు కేసులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కుమరయ్య నేతృత్వంలోని ఫుల్ బెంచ్ మరో కీలక మలుపు తిప్పింది. సుప్రీంకోర్టు కేవలం 1957 చట్టాన్ని మాత్రమే కొట్టివేసిందని, కాబట్టి ఆ చట్టం కంటే ముందు అమల్లో ఉన్న నిజాం కాలం నాటి పాత ముల్కీ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయని తీర్పునిచ్చింది. అయితే, 1972లో వి. వెంకట్రెడ్డి కేసులో చీఫ్ జస్టిస్ ఓబుల్ రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 4-1 మెజారిటీతో పాత ముల్కీ రూల్స్ చెల్లవని మళ్లీ బాంబు పేల్చింది. ఈ బెంచ్‌లో ఉన్న ఏకైక తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి మాత్రం మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ, పాత ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమేనని తన ప్రసిద్ధ భిన్న తీర్పును రికార్డు చేశారు.


హైకోర్టు ఇచ్చిన ఈ వ్యతిరేక తీర్పుపై అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా, దేశ అత్యున్నత న్యాయస్థానం తెలంగాణకు చారిత్రాత్మక విజయాన్ని చేకూర్చింది. అక్టోబర్ 3, 1972న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎమ్. సిక్రీ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పును పక్కనపెట్టి, జస్టిస్ కొండా మాధవరెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవించింది. రాజ్యాంగంలోని ప్రకరణ 35(బి) ప్రకారం నిజాం నాటి ముల్కీ నిబంధనలు ఆటోమేటిక్‌గా అమల్లోకి వస్తాయని మరియు అవి పూర్తిగా రాజ్యాంగబద్ధమైనవని తేల్చి చెప్పింది. ఈ చారిత్రక తీర్పుపై ఇక ఎలాంటి అప్పీలుకు అవకాశం లేకపోవడంతో, న్యాయపరమైన ఆటంకాలన్నీ తొలగిపోయాయని, ముల్కీ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని నాటి ముఖ్యమంత్రి పి.వి. నర్సింహారావు అధికారికంగా ప్రకటించారు. ఈ తీర్పుతో ముల్కీ నిబంధనలు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లోనూ అమలు కావడం ప్రారంభమైంది. అయితే, తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ఈ సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ 1972 అక్టోబర్ 18 నుంచి ఆంధ్ర ప్రాంతంలో 'జై ఆంధ్రా' ఉద్యమం ఉవ్వెత్తున ప్రారంభమైంది.



1972 నాటి నుంచి 2014 వరకు తెలంగాణ  ఉద్యమం కొనసాగింది. 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ రాష్ట్రం రాజకీయ డిమాండ్‌ గా మారింది. కానీ 1996 నుంచే మేధావులు, విద్యావంతులు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం విశేష కృషి చేశారు. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఫణికర మల్లయ్య నాటి సీఎం చంద్రబాబు నాయుడు ను మా తెలంగాణ మాకు కావాలి అని నిలదీసేంత చైతన్యం తీసుకొచ్చింది. తన జీవితకాలమంతా తెలంగాణ కోసం కొట్లాడిన ఆచార్య కొత్త పల్లి జయశంకర్‌ చెప్పినట్టు తెలంగాణపై వేసినన్ని కమిటీలు ఈ దేశంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వేయలేదన్నది వందశాతం వాస్తవం.. ఫజల్‌ అలీ కమిషన్‌ మొదలు శ్రీకృష్ణ కమిటీ వరకు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి వివరించిన ఏకైక వ్యక్తి . తెలంగాణ ఉద్యమంలో అనేక కీలక ఘట్టాలున్నాయి.   ముఖ్యంగా కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష, విద్యార్థులు, సకల జనులు రోడ్లపైకి వచ్చి చేసిన 11 రోజుల ఉద్యమ (2009 నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 9 వరకు) ఫలితంగా చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ప్రకటించింది. దీంతో అప్పటివరకు జై తెలంగాణ అన్న ఆంధ్రపార్టీలన్నీ యూటర్న్‌ తీసుకున్నాయి. డిసెంబర్‌ 23 ప్రకటన నాటికి నారా చంద్రబాబు, నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిలు కలిసి ఆడిన నాటకంలో నాటి పీఆర్‌పీ అధ్యక్షుడు చిరంజీవి పాత్రధారి. అయినా తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదు. పోరాటలు, వందలాది బలిదానాలు దేశ పార్లమెంటును కదిలించాయి. ముఖ్యంగా ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక పార్టీలకు ప్రజా తీర్పు ద్వారా స్పష్టమైన  సంకేతం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునకు ప్రత్యామ్నాయం ఏదీ లేదని తేల్చిచెప్పారు.  ఇదందా చరిత్ర. దీన్ని ఎవరూ మార్చలేరు. తెలంగాణ ఉద్యమంలో ఎవరి పాత్ర ఏమిటో నిక్షిప్తమై ఉన్నది. కొత్త మతం పుచ్చుకున్న వాళ్లకు నామాలు ఎక్కువ అన్నట్టు కొంతమంది తెలంగాణ ఉద్యమకారులమని చెప్పుకున్నంత మాత్రానా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. 



రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉద్యమ సమయంలో నాటి ఉద్యమనేత కేసీఆర్‌ చెప్పింది ఒక్కటే. ప్రాంతాలు విడిపోదాం. ప్రజలుగా కలిసుందాం అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ఉద్వేగపూరిత ప్రసంగాలను పరిగణనలోకి తీసుకున్నకొంతమంది ఆందోళన చెందారు. కానీ పాలకుడిగా తన బాధ్యత ఏమిటో ఆయనకు స్పష్టంగా తెలుసు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. అయినదానికి కానిదానికి పేచీలు పెట్టినా పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమ ట్యాగ్‌లైన్‌ నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించారు. శాంతిభద్రల విషయంలో రాజీ పడలేదు. అన్నివర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారు. దాని ఫలితంగా మొదటి రెండు ఎన్నికల్లోనే కాదు 2023 సార్వత్రిక ఎన్నికల్లోనూ కేసీఆర్‌ నాయకత్వానికి జనాలు జై కొట్టారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే ఈ రెండున్నరేళ్ల కాలంలో ఏం జరుగుతున్నది. ఇచ్చిన హామీ సంగతి అటుంచితే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసే అనేక ప్రయత్నాలు రేవంత్‌ ప్రభుత్వం చేసింది. అందుకే మళ్లీ తెలంగాణ సమాజం నినదిస్తున్నది. తెలంగాన అస్తిత్వ పరిరక్షణ కోసం ప్రజాసంఘాలు, ప్రజలు మళ్లీ పోరు బాట పట్టారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ పవన్‌ కల్యాణ్‌ లాంటి వాళ్లు దానిని ఎదుర్కోలేక తెలంగాణపై దండయాత్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక చంద్రబాబు పొద్దున లేస్తే తానే హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని గప్పాలు కొడుతుంటారు. మరి ఈ పుష్కరకాలంలో అమరావతిలో ఒక సచివాలయాన్ని ఎందుకు నిర్మించలేదు అంటే సమాధానం ఉండదు. హైదరాబాద్‌ కు శతాబ్దాల చరిత్ర ఉన్నది. అది ఒక స్వతంత్ర దేశంగా ఉన్న నాటి నుంచి వెల్లడి పాలనా కాలంలో, ఆ తర్వాత స్వరాష్ట్రంగా, అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా... ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్నా నాటి అభివృద్దికి కొనసాగింపు మాత్రమే. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ పదాన్ని నిషేధించిన చోటనే జై తెలంగాణ అనిపించిన ఘనత  తెలంగాణ ఉద్యమానిది. నాటి మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడిపోయిన నాటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక రాజధాని. దాన్ని నెరవేర్చే ప్రయత్నం అక్కడి పాలకులు ఇప్పటికీ చేయలేదు. కాగితాల్లో రాష్ట్ర రాజధాని నిర్మాణం కనిపిస్తుంది. ముందు అక్కడి ప్రజల ఆకాంక్ష అయిన రాజధాని నిర్మాణం, హైదరాబాద్‌ లాంటి నగర నిర్మాణం కోసం కృషి చేయాలి. అంతేగాని తెలంగాణ పై దండయాత్ర చేస్తే రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలో తెలంగాణ ప్రజలకు తెలుసు.  చివరగా తెలంగాణ కోసం బలిదానం చేసిన అమరకులకు జోహర్లు. ఆచార్య కొత్త పల్లి జయశంక్‌ సార్‌కు జోహార్లు. తెలంగాణ కోసం దశాబ్దాల పాటు కొట్లాడిన ప్రజలకు జేజేలు. అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు. 


Featured post

2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం

 ఇరాన్ యుద్ధ సెగ 2013 నాటి కంటే భారత్ ఇప్పుడే చాలా పటిష్ఠం రూపాయి విలువపై ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కీలక విశ్లేషణ! అంతర్జాతీయం...