- మిగతా దేశాధినేతలు మౌనంగా ఉన్నా అగ్రరాజ్యంపై ఒంటరి పోరుకు మొగ్గు
- ‘ట్రంప్ చేతిలో లీడర్’ అనే ముద్ర పడకుండా ఉండేందుకే వ్యూహాత్మక తిరుగుబాటు
- అమెరికాతో వ్యాపార సదస్సును రద్దు చేసుకుని ఇటలీ సార్వభౌమత్వాన్ని చాటిన వైనం
న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పెట్టుకుంటే రాజకీయంగా భారీ నష్టం జరుగుతుందని చాలామంది ప్రపంచ దేశాధినేతలు భావిస్తున్న తరుణంలో.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాత్రం దానికి భిన్నంగా దౌత్య పోరాటానికి సిద్ధమన్న సంకేతాలను ఇస్తున్నారు. గతంలో ఐరోపాను ‘తుఫానులా చుట్టేసింది’ అంటూ ట్రంప్ చేత ప్రశంసలు అందుకున్న మెలోని.. ఇప్పుడు అమెరికాకు చెందిన ఇతర మిత్రదేశాలు మనస్సులో అనుకున్నా బయటకు చెప్పలేని మూడు సాహసోపేతమైన వ్యాఖ్యలను బహిరంగంగానే చేశారు. ట్రంప్ అబద్ధాలు చెప్తారని, మిత్రులను వదిలేసి శత్రువులను ప్రసన్నం చేసుకుంటారని ఆరోపించారు. అంతేకాకుండా, రాబోయే నవంబర్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పాతాళస్థాయికి పడిపోయిన ట్రంప్ సొంత ప్రజాదరణ రేటింగులను చూసుకోవాలంటూ ఆయనకు గట్టిగా చురకలు అంటించారు. జీ7 సదస్సు ముగిసిన వెంటనే అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని చాలా దేశాలు అంగీకరించినప్పటికీ, మెలోని మాత్రం ట్రంప్ అహంకారపూరిత వైఖరిపై దూకుడు పెంచడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది.
నిజానికి జార్జియా మెలోని ఒకప్పుడు ట్రంప్ సిద్ధాంతాలను (MAGA) ఇష్టపడే సాంప్రదాయవాదిగా గుర్తింపు పొందారు. గతంలో ట్రంప్ ఆమె అందాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యలను కూడా ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఒక పాపులిస్ట్ నాయకురాలి నుండి ఇప్పుడు ఒక ఆచరణాత్మక పాలకురాలిగా మారిన మెలోని.. తన దేశంలో పొలిటికల్ బ్రాండ్ను కాపాడుకోవడానికి ట్రంప్పై ఎదురుదాడిని ఎంచుకున్నారు. ఐరోపాలో కేవలం ‘ట్రంప్ చేతిలో ఒక కీలుబొమ్మ’ అనే ముద్ర పడితే వచ్చే ఏడాది ఇటలీలో జరగబోయే ఎన్నికల్లో తనకు భారీ నష్టం జరుగుతుందని రోమ్లోని లూయిస్ యూనివర్సిటీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఐరోపా ఓటర్లలో ట్రంప్ పట్ల ఉన్న వ్యతిరేకతను గమనించిన మెలోని.. అతని దాడులకు లొంగిపోవడం కంటే తిరగబడటమే రాజకీయంగా తనకు లాభిస్తుందని భావిస్తున్నారు. అందుకే, బ్రిటన్ ప్రధాని కీర్ స్టామర్ లేదా జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ వంటి నేతలు ట్రంప్తో ఘర్షణ పడకుండా సర్దుకుపోయే ధోరణిని అవలంబిస్తుంటే.. మెలోని మాత్రం ఇటలీ గౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
ట్రంప్ తీరుకు నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రిత్వ శాఖ అగ్రరాజ్యానికి ఒక బలమైన షాక్ ఇచ్చింది. అమెరికాలోని మయామిలో జరగాల్సిన అత్యంత కీలకమైన ‘యూఎస్-ఇటలీ బిజినెస్ ఫోరమ్’ ను ఇటలీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరుకావాల్సిన ఈ సదస్సులోనే.. అమెరికా ప్రతిపాదించిన వ్యూహాత్మక ఖనిజాల ఒప్పందం ‘పాక్స్ సిలికా’ (Pax Silica) పై ఇటలీ అధికారికంగా సంతకం చేయాల్సి ఉంది. ఈ వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ట్రంప్ అహంకారానికి తలొగ్గేది లేదని మెలోని తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య పూర్తి చీలికను సూచిస్తోందని ట్రంప్ అంతర్జాతీయ భాగస్వామ్యాల రాయబారి పాలో జాంపోలి కూడా అంగీకరించడం గమనార్హం.
No comments:
Post a Comment