Sunday, 21 June 2026

ప్రపంచ ఆర్థిక సంక్షోభంలోనూ భారత్ రికార్డు ఎగుమతులు


  • ఏప్రిల్ నుంచి  జూన్ 14 వరకు 15 శాతం వృద్ధి సాధించినట్లు మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి 
  • అమెరికా విధించిన 50 శాతం భారీ టారిఫ్‌లను తట్టుకుని దేశీయ వాణిజ్యం సరికొత్త జోరు
  • మే నెలలో 6 నెలల గరిష్టానికి చేరిన ఎగుమతులు
  • ఉత్తర ముంబై నుంచి ‘వికసిత్ భారత్’ లక్ష్యం ప్రారంభం కావాలని చార్టర్డ్ అకౌంటెంట్లకు పిలుపు


ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ భారతదేశ విదేశీ వాణిజ్యం సరికొత్త రికార్డులతో దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు గల కాలంలో దేశీయ వస్తు ఎగుమతులు  దాదాపు 15 శాతం మేర భారీ వృద్ధిని నమోదు చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదివారం ప్రకటించారు. ముంబైలో చార్టర్డ్ అకౌంటెంట్లతో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ఆయన.. తన వద్ద జూన్ 14 వరకు ఉన్న తాజా గణాంకాల ప్రకారం ఎగుమతుల వృద్ధి రేటు ఎంతో ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా ప్రభుత్వం భారతీయ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించినప్పటికీ, గత 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే కాకుండా.. ప్రస్తుత త్రైమాసికంలోనూ భారత్ స్థిరమైన వృద్ధిని కనబరచడం విశేషమని ఆయన స్పష్టం చేశారు. కాగా, జూన్ నెల పూర్తిస్థాయి అధికారిక ఎగుమతి, దిగుమతి వివరాలను వాణిజ్య మంత్రిత్వ శాఖ రాబోయే జూలై 15న అధికారికంగా విడుదల చేయనుంది.



ఇటీవల వెలువడిన గణంకాల ప్రకారం.. మే నెలలో దేశ ఎగుమతులు ఆరు నెలల గరిష్ట స్థాయికి (18 శాతం వృద్ధి) చేరుకుని ఏకంగా 45.2 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో దిగుమతులు కూడా పెరగడంతో దేశ వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు విస్తరించింది. సమగ్రంగా పరిశీలిస్తే.. ప్రస్తుత ఏప్రిల్-మే రెండు నెలల కాలంలో మొత్తం ఎగుమతులు 16.09 శాతం వృద్ధితో 88.91 బిలియన్ డాలర్లుగా నిలవగా, దిగుమతులు 15.14 శాతం పెరిగి 145.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల ఈ రెండు నెలల కాలానికి గాను మొత్తం వాణిజ్య లోటు 56.44 బిలియన్ డాలర్లుగా స్థిరపడింది.


ఈ వేదికపై మంత్రి పీయూష్ గోయల్ దేశాన్ని ‘వికసిత్ భారత్’ గా మార్చే మహా యజ్ఞంలో చార్టర్డ్ అకౌంటెంట్లు తమ వంతు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ.. "అసలు వికసిత్ భారత్ లక్ష్యం ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది? అది మన ఉత్తర ముంబై నుంచే మొదలుకావాలి, ముందుగా మన సొంత ప్రాంత అభివృద్ధిని మనం బాధ్యతగా తీసుకోవాలి" అని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే నేటి నుంచి (సోమవారం) తన నియోజకవర్గ పరిధిలో మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు ,ఉన్నతాధికారుల సమన్వయంతో ఒక భారీ స్వచ్ఛతా ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. మన ఇళ్లను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో.. అలాగే మన చుట్టుపక్కల ప్రాంతాన్ని, సమాజాన్ని, మన వ్యాపార లావాదేవీలను కూడా అంతే పారదర్శకంగా, స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా కృషి చేయాలని మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు.

No comments:

Post a Comment

Featured post

తొలి బిడ్డను ఆహ్వానించడానికి ముందే ఒక తేదీని అనుకున్నాం

  పాత ఇంటర్వ్యూలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ మా ఇంటి బంగారం" విజయంతో పాటు గర్భధారణ వార్తలతో హెడ్‌లైన్స్‌ లో నిలిచిన స్టార్ హీరోయిన్ దర్...