Thursday, 6 August 2026

దతియా ఉపఎన్నిక జోష్




  •  స్థానిక సమస్యలతో మధ్యప్రదేశ్‌లో బీజేపీని చుట్టుముట్టనున్న కాంగ్రెస్‌

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దతియా శాసనసభ ఉపఎన్నికలో లభించిన ఘనవిజయంతో తీవ్ర ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని గద్దె దించేందుకు స్థానిక ప్రజా సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జితు పట్వారీ , ఆయన కుటుంబంపై బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ, దానికి నిరసనగా ఇండోర్‌లో త్వరలోనే భారీ నిరసన ప్రదర్శన చేపట్టాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఈ భారీ ఆందోళన కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ రాబోయే పోరాట వ్యూహాలకు సంబంధించి ఆగస్టు 11న భోపాల్‌లో జరగనున్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సమావేశంలో పూర్తి కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు జితు పట్వారితో పాటు మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి, అసెంబ్లీ ప్రతిపక్ష నేత ఉమంగ్ సింఘార్ తదితర సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. దతియా ఉపఎన్నిక విజయం అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలోనే స్థానిక సమస్యల ఆధారంగానే ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యాలను ఎండగడుతూనే, స్థానిక స్థాయిలో నియోజకవర్గాల వారీగా ఉన్న ప్రజా సమస్యలపై విస్తృత ఉద్యమాలు నిర్మించాలని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జితు పట్వారీ సోదరుడిపై ఎటువంటి సంబంధం లేని కేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే పీఏసీ సమావేశం ద్వారా ప్రతిపక్ష పాత్రను మరింత ప్రజారంగంలోకి తీసుకెళ్తామని, ప్రతి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు తమ ప్రాంతాల్లోని స్థానిక సమస్యలను గుర్తించి పార్టీ పరంగా గళం విప్పుతారని కాంగ్రెస్ మీడియా విభాగం వెల్లడించింది.

No comments:

Post a Comment

Featured post

ప్రధానితో నెట్‌ఫ్లిక్స్ సీఈవో భేటీ

ప్రపంచ కంటెంట్ హబ్‌గా భారత్‌పై చర్చ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నెట్‌ఫ్లిక్స్ సహ-సీఈఓ టెడ్ సరాండోస్‌తో సమావేశమయ్యారు. భారతదేశానిక...