Wednesday, 26 August 2026

సన్నీ లియోన్‌, భర్తపై చీటింగ్‌ కేసు.. కొట్టివేతను సమర్థించిన కోర్టు




ముంబై, ఆగస్టు 26: బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌, ఆమె భర్తపై దాఖలైన మోసం కేసులో ఎలాంటి నేరం రుజువు కాలేదని ముంబై కోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివాదమేనని పేర్కొంటూ కేసును కొట్టివేసింది.


సన్నీ లియోన్‌కు తెలుగు సినిమాలో అవకాశం ఇప్పించినందుకు తనకు రూ.1.75 కోట్ల పారితోషికంలో శాతం ప్రాతిపదికన కమీషన్‌ చెల్లించేందుకు ఒప్పందం కుదిరిందని ఫిర్యాదుదారు ఓంప్రకాశ్‌ శ్రీనారాయణ్‌ లాల్‌ జైన్‌ పేర్కొన్నారు. కొంత మొత్తం చెల్లించినప్పటికీ మిగిలిన బకాయి, తన కమీషన్‌ను చెల్లించలేదని ఆరోపించారు.ఈ మేరకు IPCలోని నమ్మకద్రోహం, మోసం, క్రిమినల్‌ బెదిరింపులకు సంబంధించిన సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. అయితే అంధేరీ మెజిస్ట్రేట్‌ కోర్టు 2024 అక్టోబర్‌ 10న ఫిర్యాదును తిరస్కరించడంతో జైన్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు.


ఈ పిటిషన్‌ను అదనపు సెషన్స్‌ జడ్జి పి.ఏ. సానే విచారించి కొట్టివేశారు. పన్ను ఇన్వాయిస్‌లు, సెటిల్‌మెంట్‌కు సంబంధించిన పత్రాలను పరిశీలించిన కోర్టు.. వివాదం పూర్తిగా వాణిజ్య లావాదేవీకి సంబంధించినదేనని పేర్కొంది.ఒప్పందం ఉల్లంఘన మాత్రమే జరిగిందని, నేరపూరిత నమ్మకద్రోహం లేదా బెదిరింపులకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు చూపించే ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. మోసం లేదా నమ్మకద్రోహానికి అవసరమైన అంశాలను ఫిర్యాదుదారు నిరూపించలేకపోయారని పేర్కొంది.మెజిస్ట్రేట్‌ కోర్టు తీర్పులో ఎలాంటి చట్టవిరుద్ధత, అవకతవక లేదా తప్పిదం లేదని స్పష్టం చేస్తూ.. జైన్‌ దాఖలు చేసిన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను సెషన్స్‌ కోర్టు కొట్టివేసింది. 

No comments:

Post a Comment

Featured post

విధ్వంసం మిగిల్చిన ఆకస్మిక వరదలు

  నేపాల్‌లో వరద బీభత్సం..  కాఠ్మాండు, ఆగస్టు 26: టిబెట్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక...