భారతీయ చలనచిత్ర రంగాన స్వరాభిషేకంతో శ్రోతలను ఆనందంలో ముంచెత్తిన అరుదైన గాంధర్వ గాత్రం కిషోర్ కుమార్. అభిమానులు ఆప్యాయంగా 'కిషోర్ దా' అని పిలుచుకునే ఆభాస్ కుమార్ గంగూలీ జయంతి సందర్భంగా ఆయన కలకాలం నిలిచిపోయే మధురమైన గొంతును ప్రపంచవ్యాప్తంగా సంగీతాభిమానులు స్మరించుకుంటున్నారు. ఎలాంటి సంప్రదాయ శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినప్పటికీ, తన సహజసిద్ధమైన ప్రతిభతో నటుడిగా, గాయకుడిగా, సంగీత దర్శకుడిగా , దర్శకుడిగా అద్భుతాలు సృష్టించి ఏకంగా రికార్డు స్థాయిలో ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. తరతరాలకు స్ఫూర్తినిస్తూ, ఇప్పటికీ ప్రతి గుండెను మీటుతున్న ఆయన ఐదు చిరస్మరణీయమైన గీతాల విశేషాలు ఇవే.
1973లో వచ్చిన 'బ్లాక్మెయిల్' చిత్రం కోసం కిషోర్ పాడిన "పల్ పల్ దిల్ కే పాస్" పాట బాలీవుడ్లోనే అత్యుత్తమ ప్రణయ గీతంగా నిలిచిపోయింది. మధురమైన భావోద్వేగాలు, ప్రేమికుల ఆరాటాన్ని అత్యంత ఆర్ద్రంగా పండించిన ఈ పాట ఇప్పటికీ ప్రేమజంటలకు ఆల్-టైమ్ ఫేవరెట్గా విలసిల్లుతోంది. అలాగే 1971 నాటి 'అందాజ్' చిత్రంలోని "జిందగీ ఏక్ సఫర్ హై సుహానా" పాటలో ఆయన పలికించిన ప్రత్యేకమైన 'యోడలింగ్' శైలి , నిరంతర ఉత్సాహం ఈ గీతాన్ని ప్రతీ క్షణాన్ని ఆస్వాదించమనే జీవిత సందేశంగా మార్చేశాయి.ఆయన స్వర ప్రస్థానంలో 1969లో వచ్చిన 'ఆరాధన' చిత్రంలోని "రూప్ తేరా మస్తానా" అత్యంత కీలకమైనది. ఈ పాటలోనే కిషోర్ కుమార్కు తన తొలి ఫిలింఫేర్ అవార్డు వరించింది. ఆయన లోతైన మత్తు గొంతు వెండితెరపై శృంగార భావనలకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ శ్రోతలను కట్టిపడేసింది.
సరదా పాటలకే కాకుండా విషాద గీతాలలోని ఆవేదనను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని 1978లో వచ్చిన 'ముఖద్దర్ కా సికందర్' చిత్రంలోని "ఓ సాథీ రే" పాట నిరూపిస్తుంది. గుండెకోతను, తీవ్రమైన విరహాన్ని అత్యంత సహజ సిద్ధమైన స్వరంతో ఆయన వినిపించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తుంది. ఆయనలోని అపారమైన హాస్య చతురతకు , బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం 1962 నాటి 'హాఫ్ టికెట్' చిత్రంలోని "ఆకే సీధీ లాగే దిల్ పే" గీతం. ఈ డ్యూయెట్ పాటలో అత్యంత వినూత్నంగా పురుష , స్త్రీ స్వరాలు రెండింటినీ కిషోర్ కుమారే స్వయంగా పాడటం ఆయన స్వర పరిధికి, అసాధారణ ప్రతిభకు , మరే గాయకుడికీ సాధ్యం కాని సృజనాత్మకతకు మైలురాయిగా నిలిచింది.
No comments:
Post a Comment