థాయ్లాండ్లోని ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నొంతబురి ప్రావిన్స్లోని బాంగ్ క్రువాయ్ జిల్లాలో ఉన్న డెబ్సిరిన్ స్కూల్లో తొమ్మిదో తరగతి విద్యార్థి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో ముగ్గురు ఉపాధ్యాయులు, ముగ్గురు విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై థాయ్ ఉప ప్రధాని అనుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, దాడికి గల కారణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
- స్కూల్కు వెళ్లే ముందు తాత, బామ్మను కూడా కాల్చిన విద్యార్థి
స్కూల్లో కాల్పులకు పాల్పడిన విద్యార్థి.. పాఠశాలకు వెళ్లే ముందు తన ఇంట్లో తాత, బామ్మపై కూడా కాల్పులు జరిపినట్లు థాయ్లాండ్ ప్రజారోగ్య మంత్రి తెలిపారు. ఈ ఘటనలో వారు కూడా మృతి చెందినట్లు వెల్లడించారు.
కాల్పులకు ఉపయోగించిన 9 ఎంఎం హ్యాండ్గన్ విద్యార్థి తాతకు చెందినదిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడి తాత గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు పేర్కొన్నారు. స్కూల్లో కాల్పులకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
No comments:
Post a Comment