Sunday, 30 August 2026

విపత్తు వేళ నేపాల్‌కు అండగా నిలవండి: మనీషా కోయిరాలా




  • భూతాపం ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నాం
  • భారత్‌, చైనా, నేపాల్‌ కలసి పనిచేయాలి
  • విపత్తు కారణంగా నేపాల్‌ను పర్యాటకులకు దూరం చేయొద్దు


కాఠ్మాండు: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం ప్రభావాన్ని నేపాల్‌ తీవ్రంగా ఎదుర్కొంటోందని ప్రముఖ నటి  మనీషా కోయిరాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక గురువు సద్గురు నేతృత్వంలో నిర్వహించిన ‘ఇన్‌ సాలిడారిటీ విత్‌ నేపాల్‌’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇలాంటి విపత్తులను భవిష్యత్తులో నివారించేందుకు భారత్‌, చైనా, నేపాల్‌ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ‘‘భూతాపం ప్రభావాన్ని మనం తీవ్రంగా ఎదుర్కొంటున్నాం. ఇక మన తదుపరి అడుగు ఏమిటన్నది ఆలోచించాలి. మనుషులుగా మనమంతా, ముఖ్యంగా మన గొప్ప పొరుగు దేశాలైన చైనా, భారత్‌, నేపాల్‌ ఈ సమస్యపై కలసి పనిచేయాలి. మన దేశాలన్నీ ఒకదానితో ఒకటి ఎంతో అనుసంధానమై ఉన్నాయి. ఇలాంటి విపత్తులు మళ్లీ సంభవించకుండా సమష్టిగా కృషి చేయాలి’’ అని  మనీషా కోయిరాలా అన్నారు.


ఈ విపత్తు నుంచి పాఠాలు నేర్చుకుని మరింత మానవత్వంతో ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. ‘‘ఈ విషాద ఘటనకు అర్థం చేసుకుని మనం మరింత మంచి మనుషులుగా మారాలి. మన సొంత వారిని ఆదుకున్నట్టే ఇతరులకు కూడా సాయం చేయాలి’’ అని సూచించారు.


నేపాల్‌కు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న ప్రేమ, మద్దతు కొనసాగించాలని  మనీషా కోయిరాలా విజ్ఞప్తి చేశారు. ప్రకృతి విపత్తుల కారణంగా నేపాల్‌ను కేవలం విపత్తులతో నిండిన దేశంగా చూడొద్దని కోరారు. పర్యాటక రంగం దేశానికి ఎంతో కీలకమని, విదేశీయులు నేపాల్‌ను సందర్శించడం కొనసాగించాలని పిలుపునిచ్చారు.


‘‘మా దేశానికి ప్రజలు రావాలి. నేపాల్‌ కేవలం విపత్తులతో నిండిన దేశంగా గుర్తింపు పొందాలని మేము కోరుకోవడం లేదు. టిబెట్‌-నేపాల్‌ సరిహద్దులో విపత్తు సంభవించిన మాట వాస్తవమే. అయినప్పటికీ పర్యాటకం మా దేశానికి ఊపిరి. అందుకే మీ ప్రేమ, మద్దతుతో పాటు మీ ప్రయాణాలు కూడా కొనసాగాలి’’ అని ఆమె పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

ఒడిశాకు రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

  నేడు ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు, ఉరుములు జమ్మూకశ్మీర్‌, పశ్చిమ మధ్యప్రద...