- హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాఖ్యలతో కొత్త చర్చ
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శిరోమణి అకాలీదళ్ (SAD), భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య మళ్లీ పొత్తు కుదిరే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా అకాలీదళ్ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ఢిల్లీ నుంచి పంజాబ్కు అభివృద్ధి, ప్రగతిని తీసుకొచ్చేలా మళ్లీ అలాంటి ‘ఒప్పందాలు’ జరగాలని ఆమె ఆకాంక్షించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. సంత్ హర్చంద్ సింగ్ లాంగోవాల్ 41వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పార్టీ సమావేశంలో హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “గురు సాహిబ్ ఆశీస్సులు ఉండాలి. మాట్లాడటం నా బాధ్యత కాదు కాబట్టి నేను నోరు అదుపులో పెట్టుకుంటున్నాను. మీకే త్వరలో విషయం అర్థమవుతుంది. దేవుడు ఆశీర్వదించాలి.. ప్రజలు మాకు బలం ఇవ్వాలి. గతంలో ఢిల్లీ నుంచి పంజాబ్కు అభివృద్ధి, ప్రగతికి సంబంధించిన పనులు జరిగేలా చేసిన ఒప్పందాలు మళ్లీ కుదిరి, పంజాబ్లో అభివృద్ధికి పునాది పడాలి. దాని వల్ల పంజాబ్ ప్రజలకు ప్రయోజనం కలగాలి” అని ఆమె పేర్కొన్నారు.
మోడీతో సుఖ్బీర్ భేటీతో మొదలైన చర్చ
ఈ నెల ప్రారంభంలో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పార్లమెంట్ భవన్లోని ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఈ భేటీ తర్వాత అకాలీదళ్, బీజేపీ మళ్లీ చేతులు కలిపే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. వ్యవసాయ చట్టాలపై విభేదాల నేపథ్యంలో 2020 సెప్టెంబరులో అకాలీదళ్ ఎన్డీయేకు దూరమైంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య పాత పొత్తు కొనసాగలేదు.
బీజేపీ మాత్రం ఒంటరి పోరుపైనే దృష్టి?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో పొత్తుపై ఊహాగానాలు పెరుగుతున్నప్పటికీ.. బీజేపీ వైపు నుంచి ఇప్పటివరకు స్పష్టమైన సానుకూల సంకేతాలు కనిపించలేదు. హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ ఈ నెల 10న మాట్లాడుతూ పంజాబ్లో తమ పార్టీ పొత్తు ప్రజలతోనే ఉంటుందని, మరో పార్టీతో కాదని పేర్కొన్నారు. ఇటీవల పంజాబ్కు చెందిన పలువురు బీజేపీ నేతలు రాష్ట్రంలోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతోందని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో మోగా సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పంజాబ్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. ఇక జూన్లో సుఖ్బీర్ బాదల్ కూడా పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని, బీజేపీతో పొత్తుపై అప్పటికి ఎలాంటి చర్చ లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో హర్సిమ్రత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
2022 ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎదురుదెబ్బ
2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించగా, అకాలీదళ్ మూడు స్థానాలకే పరిమితమైంది. మొత్తం 117 స్థానాలున్న అసెంబ్లీలో ఇరు పార్టీల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయింది. గతంలో మాత్రం అకాలీదళ్, బీజేపీ కలిసి ఎన్నికలను ఎదుర్కొనేవి. అప్పటి సీట్ల పంపక ఒప్పందం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాల్లో, అకాలీదళ్ 94 స్థానాల్లో పోటీ చేసేవి. లోక్సభ ఎన్నికల్లో అకాలీదళ్ 10 స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసేవి. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో హర్సిమ్రత్ కౌర్ బాదల్ కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు పాత మిత్రపక్షాల మధ్య మళ్లీ రాజకీయ అవగాహనకు సంకేతమా? అన్న చర్చకు దారితీశాయి. అయితే పొత్తుపై ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
No comments:
Post a Comment