Friday, 14 August 2026

2047 నాటికి వికసిత్‌ భారత్‌ లక్ష్యం

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ పిలుపు



80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా 13వసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ను నిర్మించేందుకు దేశ ప్రజలు పెద్ద కలలు కనాలని, వాటిని సంకల్పం, సామర్థ్యంతో సాకారం చేసేందుకు సమష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్థిక స్వావలంబన, దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, అణుశక్తి వంటి వ్యూహాత్మక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.

మహిళలకు పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ల అమలుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలని మోదీ కోరారు. మహిళా శక్తిని గౌరవించాల్సిన అవసరం ఉందని చెబుతూ, రాజకీయ పార్టీలన్నీ ఈ అంశాన్ని జాతీయ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక సాధికారతలో భాగంగా 6 కోట్ల ‘లఖ్‌పతి దీదీ’లను సృష్టించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.



జనగణనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కూడా ప్రధాని కోరారు. కుటుంబ వివరాలు డిజిటల్‌గా సరిగ్గా నమోదయ్యేలా యువత చొరవ చూపాలని సూచించారు. 2027 జనగణన దేశంలో తొలి పూర్తిస్థాయి డిజిటల్‌ జనగణనగా జరగనుండగా, జనాభా లెక్కల దశలో కుల వివరాలను కూడా సేకరించనున్నారు.

జాతీయ భద్రతపై మాట్లాడుతూ యుద్ధ స్వరూపం మారుతోందని, సరిహద్దుల్లో జరిగే సంప్రదాయ పోరాటాలకే పరిమితం కాకుండా బ్యాంకింగ్‌, మౌలిక సదుపాయాలు, రిఫైనరీలు వంటి కీలక రంగాలపై కూడా ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ పేర్కొన్నారు. దేశంలో పౌర రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఆధునిక సవాళ్లను ఎదుర్కొనే స్వచ్ఛంద దళాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.



నక్సలిజంపై మాట్లాడుతూ సాయుధ నక్సలిజం గణనీయంగా బలహీనపడిందని, మావోయిజం అంతిమ దశకు చేరుకుందని మోదీ అన్నారు. అయితే సాయుధ హింస తగ్గినప్పటికీ భావజాల రూపంలో కొనసాగుతున్న ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలని, తాను ‘మేధో నక్సల్స్‌’గా పేర్కొన్న వారిని కూడా ఒంటరిగా చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్‌ ఆర్థిక వ్యవస్థ గత దశాబ్దంలో వేగంగా ఎదిగిందని, 2014లో ‘ఫ్రాజైల్‌ ఫైవ్‌’లో ఉన్న దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’కు ప్రజలు మద్దతు ఇవ్వాలని, దేశ ఆర్థిక భద్రత కోసం స్వావలంబన అత్యవసరమని చెప్పారు. అణుశక్తి సామర్థ్యాన్ని 200 గిగావాట్లకు పెంచే లక్ష్యంతో ఐదు కొత్త అణు రియాక్టర్ల దిశగా భారత్‌ అడుగులు వేస్తోందని తెలిపారు.



ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఎర్రకోట వేదికగా ‘వందే మాతరం’ ఆలాపన జరగడాన్ని మోదీ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో నష్టపోయిన కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.




No comments:

Post a Comment

Featured post

పాలపుంత వెలుపల నక్షత్రాల ప్రవాహం

డార్క్ మ్యాటర్‌ నిగూఢాలను విప్పే దిశగా హబుల్ టెలిస్కోప్ అరుదైన ఆవిష్కరణ అంతరిక్ష రహస్యాలను ఛేదించే క్రమంలో నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలిస్...