న్యూఢిల్లీ: జంతర్మంతర్ వద్ద జూలై 20న జరిగిన ఆందోళనలో పెల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడిన 19 ఏళ్ల యువకుడు సాహిల్ లోచబ్కు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఆరు గంటల ధర్నా ఫలితాన్నిచ్చింది. సాహిల్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు చివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ధర్నాను రాహుల్ గాంధీ విరమించారు.
జూలై 20న జంతర్మంతర్ వద్ద జరిగిన నిరసనలో పోలీసులు పెల్లెట్ గన్తో కాల్పులు జరపడంతో తనకు తీవ్ర గాయాలయ్యాయని, ముఖ్యంగా కంటికి గాయం కావడంతో చూపు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని నజఫ్గఢ్కు చెందిన సాహిల్ లోచబ్ ఆరోపించారు. తన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని ఆయన వెల్లడించడంతో ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తీవ్రంగా తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం సాహిల్, అతడి తల్లితో కలిసి రాహుల్ గాంధీ ముందుగా మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో వారిని ఢిల్లీ డీసీపీ (న్యూఢిల్లీ ప్రాంతం) సచిన్ శర్మ వద్దకు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయకపోతే నిరసనకు దిగుతానని రాహుల్ హెచ్చరించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని చెప్పడంతో రాహుల్ అక్కడే ధర్నాకు కూర్చున్నారు. దీంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రియాంక గాంధీ వాద్రా, కుమారి సెల్జా, అధీర్ రంజన్ చౌధురి, జైరాం రమేశ్, సల్మాన్ ఖుర్షీద్, ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సుర్జేవాలా తదితర కాంగ్రెస్ నేతలు అక్కడికి చేరుకుని రాహుల్కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా అడ్డుకోవడానికి ‘పైనుంచి ఆదేశాలు’ ఉన్నాయని తనకు చెప్పారని రాహుల్ గాంధీ ఆరోపించారు. చివరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, అమిత్ షా నుంచి అనుమతి వచ్చిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. ‘‘న్యాయం వైపు ఇది తొలి అడుగు. ఎఫ్ఐఆర్ నమోదైంది’’ అని రాహుల్ అన్నారు.
ఏ సెక్షన్ల కింద కేసు?
సాహిల్ లోచబ్ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 118, సెక్షన్ 25 కింద కేసు నమోదు చేశారు. ప్రమాదకర ఆయుధాలు లేదా పద్ధతులతో ఉద్దేశపూర్వకంగా గాయపరచడం, ఇతరుల ప్రాణాలు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం వంటి అంశాలకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. తన ఫిర్యాదులో నీలం రంగు యూనిఫాం ధరించిన ఓ వ్యక్తి పెద్ద తుపాకీతో లోహపు పెల్లెట్లను కాల్చాడని సాహిల్ పేర్కొన్నారు. దాదాపు ఐదు, ఆరు పెల్లెట్లు తనకు తగిలాయని, కన్ను, ముఖం, చేతి, ఛాతి నుంచి రక్తస్రావం జరిగిందని తెలిపారు. కంటితో పాటు పొత్తికడుపులోనూ గాయాలు కావడంతో అనంతరం ఎయిమ్స్ ట్రామా సెంటర్లో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వెల్లడించారు.
‘న్యాయం కోసం వెనక్కి తగ్గను’
ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన యువకుడిపై పెల్లెట్ గన్ ప్రయోగించవచ్చా? కానీ అతడి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. సాహిల్కు, ఇతర బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. జూలై 20న జంతర్మంతర్లో జరిగిన నిరసనలో సాహిల్పై పోలీసులు దాడి చేశారని రాహుల్ గతంలో ఆరోపించారు. శాంతియుత ఆందోళనపై ఇలాంటి చర్య తీవ్రమైన నేరమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రాహుల్పై బీజేపీ ఎదురుదాడి
రాహుల్ గాంధీ ధర్నాపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ నేత విద్యార్థుల కోసం లేదా న్యాయం కోసం కాకుండా రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకే నిరసనకు దిగారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత జేపీ నడ్డా విమర్శించారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ తీసుకున్న వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ఆందోళన చేపట్టారని ఆరోపించారు.
No comments:
Post a Comment