ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఎంపీ బాన్సురీ స్వరాజ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ చెప్పుకునే ‘మొహబ్బత్ దుకాణం’లో ప్రేమ వ్యాపారం కంటే అవినీతి వ్యాపారమే కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాన్సురీ స్వరాజ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఒకవైపు విద్యార్థులు, యువత గురించి మాట్లాడుతున్నారని, మరొకవైపు ఆయన సొంత పార్టీకి చెందినవారే దేశంలోని యువత, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. ‘‘ఆ విద్యార్థుల గోడు రాహుల్ గాంధీ చెవులకు వినిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు.
ఉత్తరాఖండ్లో చోటుచేసుకున్న వీపీడీఓ పరీక్షల కుంభకోణాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్కు గతంలో, ప్రస్తుతం పీఏగా పనిచేస్తున్న వ్యక్తిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు చేసిందని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు, ఇతర వనరులు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో వస్తువులను స్వాధీనం చేసుకుందని పేర్కొన్నారు.
ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగంపై, ముఖ్యంగా నియామకాల వ్యవస్థపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని బాన్సురీ స్వరాజ్ అన్నారు. యువత భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవినీతి, అక్రమాలకు చోటు కల్పించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
