హైదరాబాద్, తెలంగాణ: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. నేడు జరిగిన ఘటన అత్యంత దారుణమైనదని, తెలంగాణలో ఉన్నామా.. లేక బిహార్లో ఉన్నామా అన్నంత భయానక పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ పీఆర్వో, వ్యక్తిగత కార్యదర్శిపై అత్యంత దారుణంగా, బహిరంగంగా దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులో వారిద్దరినీ ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు దాదాపు 12 గంటలపాటు విచారించారని తెలిపారు. విచారణ సమయంలో వారికి నీళ్లు, టీ, ఆహారం కూడా ఇవ్వలేదని.. న్యాయ సలహా అందించేందుకు వారి న్యాయవాదులను కూడా కలవనివ్వలేదని ఆరోపించారు.
విచారణ కొనసాగుతున్న సమయంలో 10 నుంచి 15 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు విచారణ గదిలోకి చొరబడి పోలీసు అధికారుల సమక్షంలో తమ పార్టీకి చెందిన వారిని బెదిరించారని శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరినా.. వారు నిరాకరించారని ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైన పోలీసు అధికారులు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములేనని ఆయన విమర్శించారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని తెలిపారు. అలాగే హైకోర్టును కూడా ఆశ్రయించి.. సంబంధిత అధికారులను కోర్టు ముందు నిలబెట్టి న్యాయం కోసం పోరాడతామని దాసోజు శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.

No comments:
Post a Comment