Wednesday, 26 August 2026

నేపాల్‌లో ప్రాణాంతక వరదలకు కారణమేంటి?

 


  •  కీలక విషయాలు వెలుగులోకి

కాఠ్మాండు: టిబెట్‌ నుంచి మధ్య నేపాల్‌లోకి దూసుకొచ్చిన ఆకస్మిక వరదలకు ఎత్తైన ప్రాంతంలో సంభవించిన మంచు-రాళ్ల కొండచరియల విరిగిపాటు (ఐస్‌-రాక్‌ అవలాంచ్‌) కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే వరదలకు అసలు కారణం ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి కేంద్రం (ICIMOD) తెలిపింది.

భోటేకోశి, త్రిశూలి నదుల్లో ఒక్కసారిగా నీరు, మట్టి, భారీ బండరాళ్లు ప్రవహించడంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో కనీసం 95 మంది మృతి చెందగా.. దాదాపు 500 మంది గల్లంతయ్యారు. వీరిలో 133 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఎలా సంభవించింది?

ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఎత్తైన ప్రాంతం నుంచి భారీగా మంచు, రాళ్లు ల్హెండే ఖోలా నదిలోకి పడిపోయి ఉండొచ్చు. దీంతో నదీ ప్రవాహం తాత్కాలికంగా అడ్డుపడి, ఆ తర్వాత ఒక్కసారిగా నీరు, మట్టి, బండరాళ్లతో కూడిన భారీ ప్రవాహం దిగువ ప్రాంతాలకు దూసుకెళ్లినట్లు నిపుణులు భావిస్తున్నారు.

త్రిశూలి నదిలో వరద తీవ్రతకు సంబంధించిన గణాంకాలు కూడా పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో వెల్లడిస్తున్నాయి. గల్చ్చి వద్ద కేవలం 30 నిమిషాల్లో నీటిమట్టం ఏకంగా 9 మీటర్లు పెరిగింది. మలేఖు వద్ద ఇదే సమయంలో 7 మీటర్ల మేర నీటిమట్టం పెరిగినట్లు అధికారులు తెలిపారు.

మరో వరద ముప్పు

వరదతో కొండచరియలు నదికి అడ్డుగా పడి తాత్కాలికంగా నీటి నిల్వ ఏర్పడి ఉండొచ్చని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆ అడ్డంకి అకస్మాత్తుగా తెగిపోతే మరో భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నేపాల్‌-చైనా సరిహద్దులో ఇంకా అడ్డంకి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

వాతావరణ మార్పుల ప్రభావం?

హిందూకుష్‌-హిమాలయ ప్రాంతంలో హిమనదాలు, మంచు, పర్మాఫ్రాస్ట్‌, పర్వత వాలుల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయని ICIMOD నిపుణులు తెలిపారు. అయితే తాజా వరదల్లో వాతావరణ మార్పుల పాత్ర ఎంతమేర ఉందో ఇప్పుడే నిర్ధారించలేమని స్పష్టం చేశారు.

ఇటువంటి క్రయోస్ఫియర్‌ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులు దాటి సమన్వయంతో పనిచేసే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు. ఉపగ్రహాలు, భూకంప రికార్డులు, నీటిమట్టాల గణాంకాలు, క్షేత్రస్థాయి సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్‌ ముప్పులను అంచనా వేస్తున్నారు.

No comments:

Post a Comment

Featured post

విధ్వంసం మిగిల్చిన ఆకస్మిక వరదలు

  నేపాల్‌లో వరద బీభత్సం..  కాఠ్మాండు, ఆగస్టు 26: టిబెట్‌ సరిహద్దును ఆనుకుని ఉన్న నేపాల్‌లోని రసువా జిల్లాలో బుధవారం సంభవించిన భారీ ఆకస్మిక...