Sunday, 30 August 2026

విపత్తులకు దైవ కారణాలు వెతకొద్దు

 


  • భౌతిక ఘటనలకు భౌతిక కారణాలే: సద్గురు
  • 20 ఏళ్లుగా నేపాల్‌ నా హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది
  • వరుస విపత్తులను ఎదుర్కొన్నా నేపాల్‌ ప్రజలు ధైర్యంగా నిలబడ్డారు
  • ప్రకృతిలో జరిగే ఘటనలు భౌతిక నియమాల ప్రకారమే జరుగుతాయి: సద్గురు

కాఠ్మాండు: గత 20 ఏళ్లుగా నేపాల్‌ తన హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ఆధ్యాత్మిక గురువు సద్గురు అన్నారు. నేపాల్‌లో ఇటీవల సంభవించిన తీవ్ర వరదల నేపథ్యంలో ‘ఇన్‌ సాలిడారిటీ విత్‌ నేపాల్‌’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు వాటి వెనుక దైవ కారణాలను వెతకడం కంటే.. ప్రకృతి ఘటనలు భౌతిక నియమాలకు లోబడి జరుగుతాయని అర్థం చేసుకోవాలని సూచించారు.

‘‘గత 20 ఏళ్లుగా నేపాల్‌ నా హృదయంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇలాంటి విపత్కర సమయంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు మనం కారణాలను అన్వేషిస్తాం. రకరకాల సిద్ధాంతాలను అల్లుకుంటాం. ఈ ఘటన ఎందుకు జరిగిందో అర్థం చేసుకునేందుకు ఆధ్యాత్మిక, అద్భుత కారణాలను వెతుకుతాం’’ అని సద్గురు అన్నారు.

అయితే భౌతిక ప్రపంచంలో జరిగే ప్రతి ఘటనకు భౌతిక నియమాలే కారణమని గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. ‘‘ఇలా చెప్పడం కొంత కఠినంగా అనిపించొచ్చు. ఎందుకంటే ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దైవిక కారణాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. కానీ భౌతిక ప్రపంచంలో జరిగే ఘటనలు భౌతిక నియమాల ప్రకారమే జరుగుతాయి’’ అని స్పష్టం చేశారు.

గత పదేళ్లుగా నేపాల్‌ ప్రజలు వరుసగా అనేక విపత్తులను, ఎదురుదెబ్బలను చవిచూశారని సద్గురు గుర్తుచేశారు. అయినప్పటికీ వారు వాటిని ధైర్యంగా ఎదుర్కొని, ప్రతిసారీ తిరిగి కోలుకున్నారని ప్రశంసించారు.

‘‘గత పదేళ్లలో నేపాల్‌ ప్రజలకు వరుసగా అనేక దెబ్బలు తగిలాయి. వారు వాటన్నింటినీ తట్టుకున్నారు. ఎన్నో విధాలుగా తిరిగి నిలబడ్డారు. ఈసారి కూడా వారు ఈ విపత్తు నుంచి కోలుకుని ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను’’ అని సద్గురు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

ఒడిశాకు రెడ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు

  నేడు ఒడిశాలో అత్యంత భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక పలు రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు, ఉరుములు జమ్మూకశ్మీర్‌, పశ్చిమ మధ్యప్రద...