- రెండో రోజు రెట్టింపు వసూళ్లతో బాబీ డియోల్ చిత్రం జోరు
- అనురాగ్ కశ్యప్ మేకింగ్కు దక్కుతున్న ఆదరణ
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘బందర్’ బాక్సాఫీస్ వద్ద క్రమంగా తన పట్టును సాధిస్తోంది. థియేటర్లలో పలు భారీ చిత్రాల పోటీని తట్టుకుంటూ, ఈ సినిమా రెండో రోజు వసూళ్లలో ఊహించని వృద్ధిని కనబరిచింది. మొదటి రోజుతో పోలిస్తే శనివారం నాటి కలెక్షన్లు దాదాపు రెట్టింపు కావడం విశేషం. ప్రముఖ ట్రేడ్ ట్రాకర్ 'శాక్నిల్క్' గణాంకాల ప్రకారం, బాబీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తొలిరోజు రూ. 50 లక్షల నెట్ వసూళ్లను సాధించగా, రెండో రోజైన శనివారం నాటికి అది ఏకంగా రూ. 95 లక్షలకు చేరుకుంది. ఈ అద్భుతమైన జంప్తో భారతదేశంలో ఈ సినిమా రెండు రోజుల మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 1.45 కోట్లకు చేరాయి. ప్రస్తుతం దేశీయంగా ఈ సినిమా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1.75 కోట్లుగా నమోదయ్యాయి.
ప్రస్తుతం థియేటర్లలో వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డేల కలయికలో వచ్చిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంతో పాటు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తున్న రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి భారీ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, ‘బందర్’ చిత్రం మంచి స్క్రీన్లను, ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ చిత్రంలో బాబీ డియోల్ ‘సమర్’ అనే ఒక ప్రముఖ సింగర్ , నటుడి పాత్రను పోషించారు. సమాజంలో ఎంతో పేరుప్రఖ్యాతులు ఉన్న అతని జీవితం.. గాయత్రి (సప్నా పబ్బి) అనే మహిళ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా తలకిందులవుతుంది.
ఈ ఆరోపణలు మీడియాలో సంచలనంగా మారడంతో సమర్ చుట్టూ చట్టపరమైన పోరాటాలు, పోలీసు పరిశోధనలు, మీడియా ట్రోలింగ్ ముసురుకుంటాయి. తాను నిర్దోషినని, సదరు మహిళ తనను పిచ్చిగా వెంబడించే ఒక స్టాకర్ (Stalker) అని అతను వాదించినప్పటికీ, వ్యవస్థ మొత్తం అతనికి వ్యతిరేకంగా ఎలా మారింది అనే అంశాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఎంతో ఉత్కంఠభరితంగా ఆవిష్కరించారు. బాబీ డియోల్తో పాటు ఈ చిత్రంలో సాన్యా మల్హోత్రా, సబా ఆజాద్, రాజ్ బి శెట్టి, జితేంద్ర జోషి, రిద్ధి సేన్, ఇంద్రజిత్ సుకుమారన్ , నగేష్ భోంస్లే వంటి సీనియర్ నటులు కీలకపాత్రల్లో నటించారు. మౌత్ టాక్ బాగుండటంతో రాబోయే రోజుల్లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
No comments:
Post a Comment