Monday, 27 July 2026

యువతరం చేతుల్లోనే భారతావని భవిష్యత్తు



  • ఐపీఎస్ ప్రొబేషనర్లకు అన్నా హజారే పిలుపు

దేశ నిర్మాణానికి ప్రామాణికమైన నిబద్ధత, నిస్వార్థ సేవ, ఆదర్శవంతమైన జీవన విధానం అత్యంత కీలకమని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే నొక్కిచెప్పారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 20 మంది ఐపీఎస్ ప్రొబేషనర్లు మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో ఉన్న అన్నా హజారే స్వగ్రామం రాళ్ళేగాన్ సిద్ధిని దర్శించారు. గ్రామీణాభివృద్ధి, జల సంరక్షణ రంగాల్లో ఆ ఊరు సాధించిన అద్భుత పురోగతిని అధ్యయనం చేసేందుకు వచ్చిన ఈ యువ అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువతే ఈ దేశానికి నిజమైన బలమని, రాబోయే రోజుల్లో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత వారిపైనే ఉందంటూ అన్నా హజారే స్పష్టం చేశారు. దేశ సేవలో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరూ ఐదు ముఖ్యమైన సూత్రాలను పాటించాలని ఆయన హితవు పలికారు. ప్రవర్తనలో పరిశుద్ధత, ఆలోచనల్లో నిర్మలత్వం, మచ్చలేని జీవితం, త్యాగనిరతి,  విమర్శలను, అవమానాలను తట్టుకునే ఓర్పు వంటి లక్షణాలు ప్రతి అధికారికి అవసరమని సూచించారు.


ఈ సందర్భంగా రాళ్ళేగాన్ సిద్ధి గ్రామం కరువు కోరల నుంచి ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాగా ఎలా మారిందో వివరించడమే కాకుండా, 2011లో న్యూఢిల్లీ వేదికగా సాగిన అవినీతి వ్యతిరేక పోరాట జ్ఞాపకాలను ఆయన పంచుకున్నారు. అనంతరం ఐపీఎస్ అధికారులతో ముఖాముఖి నిర్వహించి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అహిల్యానగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎమ్ సుదర్శన్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా, హజారేతో కలిసి ఆయన నూతన అధికారులను ఘనంగా సత్కరించారు.

No comments:

Post a Comment

Featured post

పేపర్ లీక్‌లపై ఉక్కుపాదం

లోక్‌సభలో సవరణ బిల్లు ప్రవేశం..  మంగళవారం విస్తృత చర్చకు అన్ని పార్టీల అంగీకారం నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై వరుసగా ఆరు రోజులుగా పా...