- పశ్చిమాసియాలోని మౌలిక వసతులపై దాడులు చేస్తామని తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్:హోర్ముజ్ జలసంధి రక్షణ పేరుతో తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ అంతే వేగంగా కౌంటర్ ఇచ్చింది. అమెరికా గనుక తమ సివిల్ మౌలిక సదుపాయాలు, వంతెనలు లేదా విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే, దానికి ప్రతీకారంగా పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న అమెరికా ప్రయోజనాలు, ఎనర్జీ వసతులపై ఎదురుదాడులు చేస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది. తము నిర్ణయించుకున్న నిబంధనలకు లోబడి ప్రయాణించే నౌకలకు జలసంధిలో ఎలాంటి ఆటంకం ఉండదని, అయితే తమ భద్రతకు అత్యంత కీలకమైన ఈ జలసంధిపై నియంత్రణను వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్ మిలిటరీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలైన కింగ్ ఫైసల్, ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్లపై క్షిపణులు, డ్రోన్లతో తామే దాడి చేశామని, ఈ దాడిలో అమెరికా ఎఫ్-15 యుద్ధ విమానం హ్యాంగర్, ఎంక్యూ-9 డ్రోన్లు ధ్వంసమవ్వడమే కాకుండా సైనికులు మరణించారని ఇరాన్ ఐఆర్జీసీ (IRGC) ప్రకటించింది. అయితే తమ వైమానిక రక్షణ వ్యవస్థలు నాలుగు క్షిపణులను, నాలుగు డ్రోన్లను గాలిలోనే కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. ఈ వరుస దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి.
No comments:
Post a Comment