- సీజేపీ ఆందోళనకారులపై పోలీసుల బాష్పవాయు ప్రయోగం
న్యూఢిల్లీ: నీట్ యూజీ (NEET-UG) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం సీజీపీ (Cockroach Janta Party - CJP) నేతృత్వంలో విద్యార్థులు, యువత చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనకారులు పార్లమెంట్ వైపు మార్చ్కు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనగా, పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది ఆందోళనకారులపై బాష్పవాయువు (టీయర్ గ్యాస్) ప్రయోగించారు. వివరాల్లోకి వెళ్తే.. కొద్ది రోజులుగా నీట్ లీకేజీ అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బుధవారం నాటి ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు ప్లకార్డులు చేతబూని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జంతర్ మంతర్ సమీపంలో ఏర్పాటు చేసిన పోలీసు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకెళ్లేందుకు నిరసనకారులు యత్నించడంతో పోలీసులు లాఠీఛార్జీ చేయడమే కాకుండా, పెద్ద ఎత్తున టీర్ గ్యాస్ షెల్స్ వదిలి వారిని చెల్లాచెదురు చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు, పోలీసు సిబ్బంది గాయపడగా, ఆ ప్రాంతమంతా పొగచూరి తీవ్ర గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని, న్యాయమైన డిమాండ్ల కోసం ప్రశ్నిస్తుంటే లాఠీలు, బాష్పవాయువుతో అణచివేయాలని చూడటం అమానుషమని సీజేపీ ప్రతినిధులు మండిపడ్డారు.

No comments:
Post a Comment