Wednesday, 29 July 2026

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు

 


 సెమీస్‌కు సాక్షి చౌదరి, చరిత్ర సృష్టించిన గుల్వీర్ సింగ్

గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు మరోసారి సత్తా చాటుతున్నారు. మహిళల 51 కిలోల బాక్సింగ్ విభాగంలో సాక్షి చౌదరి ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన కైట్లిన్ ఫ్రైయర్స్‌ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరడంతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. దీంతో ఈ గేమ్స్‌లో భారత్‌కు పతకం ఖాయం చేసుకున్న ఐదో బాక్సర్‌గా నిలిచింది. ఇప్పటికే లవ్లీనా బోర్గొహైన్ (75 కేజీలు), ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), జాదుమణి సింగ్ (పురుషుల 55 కేజీలు) పతకాలు ఖాయం చేసుకున్నారు.

పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఈ విభాగంలో పతకం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పాడు. 27 నిమిషాల 49.78 సెకన్లలో రేసును పూర్తి చేసిన గుల్వీర్, ఆస్ట్రేలియాకు చెందిన కై రాబిన్సన్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.

మహిళల 69 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో హర్జిందర్ కౌర్ 227 కిలోల మొత్తం బరువు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. బర్మింగ్‌హామ్ 2022లో కాంస్యం సాధించిన ఆమెకు ఇది వరుసగా రెండో కామన్వెల్త్ పతకం. గ్లాస్గో గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది ఏడో పతకం.

దీంతో గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 12కు చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 7 రజతాలు, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

Featured post

ఫలించిన బీఆర్ఎస్ పోరాటం

హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం  నంది, గాయత్రి పంప్ హౌస్‌లలో మోటార్లు షురూ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా...