గ్లాస్గో వేదికగా జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల్లో భారత ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సరికొత్త చరిత్ర సృష్టించారు. మహిళల 48 కేజీల ఫైనల్లో భాగంగా స్నాచ్ విభాగంలో 85 కేజీల బరువును ఎత్తి కొత్త కామన్వెల్త్ రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. పోటీల ప్రారంభంలో 82 కేజీల బరువును ఎత్తే మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పటికీ, రెండో ప్రయత్నంలో దాన్ని విజయవంతంగా ఎత్తారు. ఆ తర్వాత తన చివరి ప్రయత్నంలో ఏకంగా 85 కేజీల బరువును ఎత్తి సరికొత్త గేమ్ల , కామన్వెల్త్ రికార్డులను నెలకొల్పారు. గతంలో 2018, 2022 కామన్వెల్త్ క్రీడల్లోనూ మీరాబాయి చాను స్వర్ణ పతకాలను సాధించడం గమనార్హం.
మరోవైపు, పురుషుల విభాగంలో భారత వెయిట్లిఫ్టర్ చానంబం రిషికాంత సింగ్ మొత్తం 264 కేజీల (121 కేజీల స్నాచ్ + 143 కేజీల క్లీన్ అండ్ జెర్క్) బరువును ఎత్తారు. మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ కాస్దాన్ మొత్తం 273 కేజీల (121 కేజీల స్నాచ్ + 152 కేజీల క్లీన్ అండ్ జెర్క్) కొత్త గేమ్ల రికార్డుతో స్వర్ణ పతకం సాధించగా, కెన్యాకు చెందిన జాషువా ఎంబోయా 260 కేజీలతో (115 కేజీలు + 145 కేజీలు) కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. భారత లిఫ్టర్ రిషికాంత సింగ్ స్నాచ్ విభాగంలో అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. మొదట 116 కేజీలు, ఆ తర్వాత 119 కేజీలను విజయవంతంగా ఎత్తి, తన చివరి ప్రయత్నంలో 121 కేజీలు ఎత్తడం ద్వారా కామన్వెల్త్ గేమ్ల స్నాచ్ రికార్డును బద్దలు కొట్టడంతో పాటు వ్యక్తిగత ఉత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. అయితే, మలేషియాకు చెందిన కాస్దాన్ కూడా త్వరలోనే 121 కేజీల మార్కును అందుకోవడంతో మొదటి విభాగం ముగిసేసరికి ఇద్దరూ సమవుజ్జీలుగా నిలిచారు.
ఆ తర్వాత జరిగిన క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో రిషికాంత మొదట 143 కేజీలు ఎత్తి మొత్తం 264 కేజీలతో తాత్కాలికంగా అగ్రస్థానంలో నిలిచారు. కానీ కాస్దాన్ వెంటనే 145 కేజీలు, ఆ తర్వాత 149 కేజీలను ఎత్తి మొత్తం 270 కేజీలతో భారతీయుడిపై ఒత్తిడి పెంచారు. తిరిగి ఆధిక్యంలోకి రావడానికి రిషికాంత తన చివరి ప్రయత్నంలో 151 కేజీలు ఎత్తాల్సి రాగా, ఆయన క్లీన్ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ జెర్క్ను ముగించలేకపోవడంతో స్వర్ణ పతక పోరాటం ముగిసింది. ఆ తర్వాత కాస్దాన్ తన చివరి ప్రయత్నంలో 152 కేజీలు ఎత్తి మొత్తం 273 కేజీల రికార్డుతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.
No comments:
Post a Comment