- కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు!
ప్రజా పరీక్షల (అక్రమ మార్గాల నిరోధక) సవరణ బిల్లు–2026కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నప్పటికీ, పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను విస్మరించలేమని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ లోక్సభలో విమర్శించారు. పరిపాలన అనేది ప్రచార శీర్షికలతో కాకుండా ఫలితాలతో కొలవబడుతుందని పేర్కొంటూ, ప్రభుత్వం ప్రతి ఏడాది కొత్త వ్యవస్థ తీసుకొస్తామని హామీ ఇస్తున్నా, విద్యార్థులకు మాత్రం ప్రతి ఏడాది అదే పాత పేపర్ లీక్ కుంభకోణాలు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.
లోక్సభలో బిల్లుపై జరిగిన చర్చలో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ, పరీక్షల పేర్లు మారుతున్నాయని, బాధితుల పేర్లు మారుతున్నాయని, నిందితుల పేర్లు కూడా మారుతున్నాయని, కానీ నేరాలు మాత్రం మారడం లేదని, అలాగే ప్రభుత్వం కూడా మారడం లేదని విమర్శించారు. దేశంలో ఉపగ్రహాలను పర్యవేక్షించగలమని, క్షిపణులను గుర్తించగలమని, సైబర్ భద్రతను కాపాడగలమని ప్రభుత్వం చెబుతోందని, అయితే గోప్యమైన ప్రశ్నపత్రాలు మాత్రం ప్రభుత్వానికి తెలియకముందే బయటకు వెళ్లిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇది ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనా పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోందని అన్నారు.
నీట్ (Re-NEET) పరీక్ష కోసం ప్రశ్నపత్రాలను భారత వైమానిక దళానికి చెందిన విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేసిన అభిషేక్ బెనర్జీ, యువతకు ఇలాంటి ప్రదర్శనలు అవసరం లేదని, వారికి కావాల్సింది కేవలం పారదర్శకత, న్యాయమైన పరీక్షల వ్యవస్థ మాత్రమేనని అన్నారు.
పేపర్ లీక్లకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన విద్యార్థుల మాట వినాల్సిన కేంద్ర ప్రభుత్వం, వారికి బదులుగా బ్యారికేడ్లు, లాఠీలు, పెల్లెట్ గన్స్తో సమాధానం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. విద్యార్థులు పోటీని చూసి భయపడరని, అవినీతినే భయపడతారని అన్నారు. ప్రతిభను చూసి కాదు, వ్యవస్థలో జరిగే అక్రమాలను చూసే భయపడుతున్నారని పేర్కొన్నారు. పరీక్షలను కాదు, పరీక్షల నిర్వహణ వ్యవస్థనే యువత అనుమానిస్తోందని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తే, ప్రజాస్వామ్యమే బలహీనపడుతుందని హెచ్చరించారు. విద్యార్థులు ప్రభుత్వ సానుభూతిని కోరుకోవడం లేదని, న్యాయం జరిగే వ్యవస్థపై భరోసా కోరుతున్నారని స్పష్టం చేశారు.
No comments:
Post a Comment