- హరీష్ రావు పట్టుదలకు దక్కిన విజయం
- నంది, గాయత్రి పంప్ హౌస్లలో మోటార్లు షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన అనుబంధ లింక్-2 ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలంలోని నంది పంప్ హౌస్ , కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్లోని బాహుబలి మోటార్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఆన్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం చేసిన నిరంతర పోరాటానికి, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పట్టుదలకు లభించిన విజయంగా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి. కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ ఎత్తిపోతల మోటార్లను స్టార్ట్ చేయకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. రైతుల పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతర పోరాటం సాగించారు. ప్రతిపక్షాల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు , రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి మోటార్లను ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అధికారులు పంప్ హౌస్లలోని రెండు బాహుబలి మోటార్లను అందుబాటులోకి తెచ్చి, దాని ద్వారా 6,300 క్యూసెక్కుల గోదావరి నీటిని దిగువనున్న శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) వైపు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యత ఉన్నప్పటికీ పంప్ హౌస్లను ఐడిల్గా ఉంచడంపై బీఆర్ఎస్ చేసిన పోరాటం ఫలించి, నీటి విడుదల ప్రారంభం కావడంతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం పరిధిలోని రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజాక్షేత్రంలో రైతుల తరఫున నిలబడి పోరాడితే ప్రభుత్వం ఎంతటి మొండివైఖరి వీడైనా దిగిరాక తప్పదని ఈ ఉదంతం మరోసారి నిరూపించిందని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి.
No comments:
Post a Comment