- పేపర్ లీక్ వ్యతిరేక బిల్లు, సభా వ్యూహాలపై కీలక సమాలోచనలు
భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) పార్లమెంటరీ పార్టీ తన వారపు 'మంగళ్ మిలన్' సమావేశాన్ని మంగళవారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనుంది. న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఉన్న జీఎంసీ బాలుయోగి ఆడిటోరియంలో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామంగా, ఇటీవల ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI) తొలిసారిగా పాల్గొనబోతోంది. కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026'పై నాలుగు గంటల పాటు జరిగే చర్చలో పాల్గొనేందుకు ఎన్డీయే పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది. బిజెపి ఎంపీలు బన్సూరి స్వరాజ్, తేజస్వి సూర్యలతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాలైన జేడీయూ ఎంపీ ఆలోక్ కుమార్ సుమన్, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఎన్సీపీ ఎంపీ సునీల్ తట్కరే, అప్నా దళ్ ఎంపీ అనుప్రియా పటేల్, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ అరుణ్ భారతి తదితరులు ఈ చర్చలో ప్రసంగించనున్నారు. జూలై 20న జరిగిన 'సంసద్ చలో' నిరసన ప్రదర్శన సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా జవాబుదారీతనం వహించాలని, అలాగే ప్రతిపాదిత బిల్లు సమర్థతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్ను స్తంభింపజేస్తున్న వేళ ఈ ఎన్డీయే సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గత వారం జరిగిన 'మంగళ్ మిలన్' సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందని, పేపర్ లీకేజీల వ్యవహారం జాతీయ సమస్య అని, దీనిని రాజకీయం చేయకూడదని స్పష్టం చేశారు. న్యాయ నిపుణుల సలహాలతో పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.
No comments:
Post a Comment