Tuesday, 30 June 2026

పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం కాదు


  • భారత్‌ సహాయం కోరతాం.. 
  • ఇస్లామాబాద్‌కు నిరసనకారుల ఘాతుక హెచ్చరిక
  • రావాలాకోట్‌లో 22వ రోజుకు చేరిన ప్రజా తిరుగుబాటు
  • ఆహార సరఫరా నిలిపివేత , ఇంటర్నెట్ బ్లాకౌట్‌ పై పీవోకే ప్రజల ఆగ్రహం
  • ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓ డిక్టేటర్ అంటూ నినాదాలు
  • అంతర్జాతీయంగా దౌత్య కార్యాలయాల ముందు ప్రవాస కశ్మీరీల ఆందోళనలు



పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లో పాకిస్తాన్ ప్రభుత్వానికి , అక్కడి సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా తిరుగుబాటు ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. రావాలాకోట్ నగరంలోని ఈద్గా గ్రౌండ్ వేదికగా మంగళవారం నాటికి ఈ నిరసన ప్రదర్శనలు వరుసగా 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వేలాదిమంది నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడిన పలువురు స్థానిక నేతలు.. ఈ ప్రాంతం ఇకపై ఎంతమాత్రం పాకిస్తాన్ నియంత్రణలో ఉండబోదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్ అనుసరిస్తున్న దుర్మార్గపు విధానాలపై తాము తీవ్ర విసుగు చెందామని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తాము భారతదేశంతో బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి , ఢిల్లీ వైపు అడుగులు వేయడానికి కూడా వెనకాడబోమని పాక్ పాలకులను గట్టిగా హెచ్చరించారు. దశాబ్దాలుగా సాగుతున్న పరిపాలనా నిర్లక్ష్యం, ఆర్థిక సంక్షోభం, విపరీతమైన ద్రవ్యోల్బణం,పాక్ సైన్యం సాగిస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా ఈ ప్రజా ఉద్యమం మొదలైంది. ఈ నిరసనల తీవ్రత బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు పాక్ ప్రభుత్వం జూన్ 5 నుంచి ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి డిజిటల్ బ్లాకౌట్ విధించింది.


ప్రముఖ పౌర హక్కుల ప్రతినిధి సర్దార్ అమన్ ఖాన్ నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాక్ పాలకులు కక్షసాధింపు చర్యలకు దిగారు. నిరసనకారులను లొంగదీసుకోవాలనే ఉద్దేశంతో  రెండు వారాలుగా ఈ ప్రాంతానికి వచ్చే ఆహార సరఫరాను , నిత్యావసర వస్తువులను పాక్ సైన్యం పూర్తిగా నిలిపివేసి దిగ్బంధనం (Blockade) విధించింది. దీనిపై అమన్ ఖాన్ తీవ్రంగా ధ్వజమెత్తుతూ.. "పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నటికీ పాకిస్తాన్ లో భాగం కాదు. మాపై ఆధారపడటం పాకిస్తాన్‌కే ఎక్కువ అవసరం కానీ, మాకు పాకిస్తాన్ అవసరం లేదు" అని స్పష్టం చేశారు. జూన్ 9 నుండి లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సరిహద్దు సమీపంలో కూడా ప్రత్యేకంగా భారీ ఎత్తున బైఠాయింపు (Sit-in) నిరసనలు సాగుతున్నాయి. ఒకవేళ పాక్ సైన్యం ఇలాగే ఆహారం, మందుల సరఫరాపై ఆంక్షలు కొనసాగిస్తే.. తాము తమ మనుగడ కోసం మరియు మానవతా సహాయం కోసం సరిహద్దు దాటి భారతదేశాన్ని ఆశ్రయిస్తామని, అదే గనుక జరిగితే ఈ ప్రాంతపు రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయి ఇస్లామాబాద్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఖాన్ హెచ్చరించారు.


ఈ నిరసనలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందులో స్థానిక కశ్మీరీ పౌరులు తాము పాకిస్తానీయులం కాదంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఒక క్రూరమైన డిక్టేటర్ (నియంత) అని, అతని సైనిక ఆరాచకాలను తాము ఎంతమాత్రం సహించబోమని ప్రజలు వీధుల్లో నినదిస్తున్నారు. ఈ ప్రజా తిరుగుబాటు కేవలం పీఓకే సరిహద్దులకే పరిమితం కాకుండా.. విదేశాలలో నివసిస్తున్న ప్రవాస కశ్మీరీల మద్దతుతో మరింత అంతర్జాతీయ రూపం దాల్చింది. పలు దేశాల్లో ఉన్న పాకిస్తాన్ రాయబార కార్యాలయాల (Diplomatic missions) ముందు ప్రవాస కాశ్మీరీలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ పాక్ సైన్యానికి వ్యతిరేకంగా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతున్నారు. ముజఫరాబాద్ తో పాటు మొత్తం రీజియన్ లో తమ రాజకీయ హక్కులు , స్వయంప్రతిపత్తి సాధించేంతవరకు ఈ సుదీర్ఘ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని నిరసనకారుల కమిటీ స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

Featured post

కాళేశ్వరం కూలినా వరిసాగులో తెలంగాణే నంబర్ వన్

కేసీఆర్ పాపాలు నా నెత్తిన పెట్టారు..  మోడీ, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు రూ. లక్ష కోట్లు లూటీ చేసినా బోరు బావుల కిందే పంటలు సర్పం...