- ముంబైలో కమలం వికాసం.. వెనుకంజలో ఠాక్రే సోదరులు!
ముంబై: ఆసియాలోనే అత్యంత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ 'బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్' (BMC) ఎన్నికల కౌంటింగ్లో అధికార 'మహాయుతి' కూటమి (బీజేపీ - ఏకనాథ్ షిండే శివసేన) దూసుకుపోతున్నది. నేడు (జనవరి 16, 2026) ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి అంచనాల ప్రకారం.. బీజేపీ - షిండే వర్గం స్పష్టమైన ఆధిక్యం దిశగా సాగుతున్నాయి. సుమారు 20 ఏళ్ల తర్వాత ముంబై అస్తిత్వం కోసం చేతులు కలిపిన ఠాక్రే సోదరులకు (ఉద్ధవ్ ఠాక్రే - రాజ్ ఠాక్రే) ఈ ట్రెండ్స్ షాక్ ఇస్తున్నాయి. ప్రారంభంలోనే బీజేపీ సుమారు 43 వార్డుల్లో, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 17 వార్డుల్లో ముందంజలో ఉన్నాయి.
మరోవైపు, ముంబైపై తమ పట్టు నిలుపుకోవాలని భావించిన ఠాక్రే సోదరుల కూటమి ఆశించినస్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) ప్రస్తుతం 29 వార్డులకు పరిమితం కాగా, రాజ్ థాకరేకు చెందిన ఎంఎన్ఎస్ కేవలం 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. వీరిద్దరి ఉమ్మడి బలం కూడా మహాయుతి దూకుడును అడ్డుకోలేకపోవడం గమనార్హం. కాంగ్రెస్ అభ్యర్థి ఆశా కాలే ధారావి (వార్డు 183) నుంచి విజయం సాధించి, ఈ ఎన్నికల్లో తొలి విజేతగా నిలిచారు. ముంబైతో పాటు థానే, నవీ ముంబై వంటి నగరాల్లో కూడా బీజేపీ కూటమి గట్టి పోటీనిస్తున్నది. ఓట్ల లెక్కింపు దశలవారీగా జరుగుతుండటంతో పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
No comments:
Post a Comment