- అగ్రనేత హత్యను ఖండించకపోవడానికి గల కారణాలను విశ్లేషించిన నిపుణులు!
న్యూఢిల్లీ: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించినప్పటికీ, భారతదేశం ఆ మరణాన్ని అధికారికంగా ఖండించకపోవడం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా మిత్రదేశాల అధినేతలు మరణించినప్పుడు సంతాపం తెలిపే భారత్, ఈ విషయంలో కేవలం 'తీవ్ర ఆందోళన' వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. దీని వెనుక భారత్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలు, గత చేదు అనుభవాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్ తన పశ్చిమాసియా రాజకీయాల్లో భారత్ అంతర్గత వ్యవహారాలైన కాశ్మీర్ అంశంపై గతంలో చేసిన విమర్శలు, భారత్ తన నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవడానికి ఒక కారణమని సమాచారం.
మరోవైపు, అమెరికా , ఇజ్రాయెల్లతో భారత్ కలిగి ఉన్న బలమైన రక్షణ , వ్యూహాత్మక సంబంధాలు కూడా ఈ మౌనానికి ప్రధాన కారణం. ఇరాన్ అగ్రనేతను 'ఉగ్రవాదానికి మద్దతుదారుడు'గా పశ్చిమ దేశాలు పరిగణిస్తున్న తరుణంలో, ఆయన్ను సమర్థించడం వల్ల అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భారత్ భావిస్తున్నది. అయితే, ఇరాన్లోని చాబహార్ ఓడరేవులో భారత్ చేసిన భారీ పెట్టుబడులు ,అక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఇరాన్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినకుండా భారత్ మధ్యేమార్గం అనుసరిస్తున్నది. అందుకే 'సంయమనం పాటించాలని' ,'సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని' సాధారణ ప్రకటనకే భారత్ పరిమితమైంది.
No comments:
Post a Comment