బెంగాల్కు ఆర్.ఎన్. రవి.. ఢిల్లీ ఎల్జీగా తరంజిత్ సింగ్ సంధు!
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు , లెఫ్టినెంట్ గవర్నర్లను (LG) నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ మార్పుల్లో భాగంగా, తమిళనాడు గవర్నర్గా ఉన్న ఆర్.ఎన్. రవిని పశ్చిమ బెంగాల్కు బదిలీ చేశారు. బెంగాల్ గవర్నర్ డాక్టర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానంలో రవిని నియమించారు. అదేవిధంగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాను లడఖ్ ఎల్జీగా బదిలీ చేయగా, ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధును ఢిల్లీ కొత్త లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించారు.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మార్పుల ప్రభావం కనిపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను తెలంగాణ కొత్త గవర్నర్గా నియమించగా, ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేశారు. బిహార్ గవర్నర్గా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్, నాగాలాండ్కు నంద్ కిషోర్ యాదవ్ నియమితులయ్యారు. లడఖ్ ఎల్జీగా ఉన్న కవీందర్ గుప్తాను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పదోన్నతి కల్పించారు. కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రస్తుతానికి తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ఈ సమగ్ర మార్పులు తక్షణమే అమలులోకి వస్తాయని అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment