- ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో కీలక పోర్టు ధ్వంసం!
లెనిన్గ్రాడ్/కీవ్: రష్యా ఆర్థిక మూలాలపై ఉక్రెయిన్ మరోసారి విరుచుకుపడింది. రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలకమైన ఉస్త్-లుగా (Ust-Luga) నౌకాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్లు విధ్వంసం సృష్టించాయి. వారం వ్యవధిలోనే రెండోసారి జరిగిన ఈ దాడితో రష్యా ఇంధన ఎగుమతులకు భారీ ఆటంకం ఏర్పడింది.గత వారం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర దెబ్బతినడంతో ఇప్పటికే ఎగుమతులు నిలిచిపోయాయి. తాజాగా ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. లెనిన్గ్రాడ్ ప్రాంత గవర్నర్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ.. తాము సుమారు 31 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించారు.
- ఉస్త్-లుగా పోర్టు ప్రాధాన్యం
బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యాకు ఇది అత్యంత వ్యూహాత్మకమైన కేంద్రం. సముద్ర మార్గంలో రష్యా చేసే మొత్తం చమురు ఎగుమతుల్లో 45% వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతాయి. ఇక్కడి నుండి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది.రష్యా నుంచి భారత్కు ఇంధనం సరఫరా చేసే కీలక పోర్టుల్లో ఇది కూడా ఒకటి.
- రష్యా ఆర్థిక వ్యవస్థపై గురి
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో, రష్యా తన లోటు బడ్జెట్ను పూరించుకోవాలని భావించింది. అయితే ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా రష్యా ఇంధన పరిశ్రమనే లక్ష్యంగా చేసుకుంటోంది. కేవలం ఈ నెలలోనే ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు జరిగాయి. గత వారం సర్టోవ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కర్మాగారంపై కూడా దాడులు జరిగాయి.తమ సుదీర్ఘ శ్రేణి డ్రోన్లు రష్యా అంతర్భాగంలోకి వెళ్లి తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రష్యా యుద్ధం కొనసాగించడానికి అవసరమైన ఆర్థిక వనరులను దెబ్బతీయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
No comments:
Post a Comment