- స్పీకర్ ఓం బిర్లా భేటీలో కీలక నిర్ణయం!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభ నుండి సస్పెండ్ అయిన ఎనిమిది మంది విపక్ష ఎంపీలకు ఊరట లభించే అవకాశం ఉంది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీరి సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు పార్లమెంటరీ వర్గాలు వెల్లడించాయి. సోమవారం స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో ఈ సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.
గత ఫిబ్రవరి 3న సభలో అనుచితంగా ప్రవర్తించారనే కారణంతో ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలు , ఒక సిపిఐ(ఎం) ఎంపీని బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు (ఏప్రిల్ 2 వరకు) సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్కు గురైన వారిలో గుర్జీత్ సింగ్ ఔజ్లా, హిబీ ఈడెన్, సి. కిరణ్ కుమార్ రెడ్డి, అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, ప్రశాంత్ పడోలే, డీన్ కురియకోస్ (కాంగ్రెస్) మరియు ఎస్. వెంకటేశన్ (సిపిఐ-ఎం) ఉన్నారు. అప్పటి నుండి వీరి సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు నిరంతరాయంగా డిమాండ్ చేస్తున్నాయి.
సభ సజావుగా సాగేందుకు గానూ స్పీకర్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొన్ని కీలక నిబంధనలపై ఉభయ పక్షాలు అంగీకారానికి వచ్చాయి. ఇకపై సభ్యులెవరూ సభ మధ్యలోకి ) వెళ్లి నిరసన తెలపకూడదని, స్పీకర్ పోడియం వైపు పేపర్లు చింపి వేయకూడదని మరియు అధికారుల టేబుల్స్ ఎక్కకూడదని నిర్ణయించారు. అలాగే సభలో ప్లకార్డులు, పోస్టర్లు మరియు ఏఐ ద్వారా రూపొందించిన వివాదాస్పద చిత్రాలను ప్రదర్శించకూడదని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ గౌరవ మర్యాదలను కాపాడటమే తమ ప్రాధాన్యమని స్పీకర్ ఓం బిర్లా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
No comments:
Post a Comment