Wednesday, 25 March 2026

బాద్‌షా వ్యక్తిగత జీవితంలో కొత్త మలుపు


  • పాపులర్ ర్యాపర్ రిలేషన్‌షిప్ టైమ్‌లైన్ ఇదే

ముంబై: భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ ర్యాపర్ బాద్‌షా (Badshah) తాజాగా తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆయన రెండో వివాహం చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆయన గత వైవాహిక జీవితం , రిలేషన్‌షిప్ ప్రయాణంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బాద్‌షా మొదటి వివాహం 2012లో జాస్మిన్ మసీహ్ అనే యువతితో జరిగింది. వీరిద్దరికీ 2017లో 'జేసీ గ్రేస్ సింగ్' అనే కుమార్తె జన్మించింది. అయితే, పరస్పర విభేదాల కారణంగా 2019 నుండి వీరిద్దరూ విడిగా ఉంటున్నారని, కొవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో వారి మధ్య దూరం మరింత పెరిగిందని సమాచారం. చివరకు 2020లో వీరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం జాస్మిన్ తన కుమార్తెతో కలిసి లండన్‌లో నివసిస్తున్నారు.



విడాకుల తర్వాత బాద్‌షా జీవితంలోకి పంజాబీ నటి ఇషా రిఖీ ప్రవేశించారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఒకరి కుటుంబ సభ్యులను మరొకరు కలుసుకోవడం, పార్టీలలో జంటగా కనిపించడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఇషా రిఖీతో సంబంధం ముగిసిందని, బాద్‌షా తన చిరకాల స్నేహితురాలు, పాకిస్థానీ నటి హానియా ఆమిర్‌తో సన్నిహితంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపించాయి. దుబాయ్‌లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేయడంతో వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, హానియా ఆమిర్ ఈ వార్తలను ఖండించి, తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని స్పష్టం చేశారు.


ఇక అసలు విషయానికి వస్తే, బాద్‌షా ఇటీవల ఇషా రిఖీ ని అత్యంత రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కెరీర్ ప్రారంభం నుండి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే అలవాటున్న ఈ ర్యాపర్, తన రెండో పెళ్లి గురించి కూడా ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కేవలం అతికొద్ది మంది సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు సమాచారం. తన పాటలతో మిలియన్ల మందిని ఉర్రూతలూగించే బాద్‌షా, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను అధిగమించి ఇప్పుడు కొత్త జీవితాన్ని ప్రారంభించారని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

No comments:

Post a Comment

Featured post

లోక్‌సభలో ఫైనాన్స్ బిల్లు 2026కు ఆమోదం

భారత్ 'సంస్కరణల ఎక్స్‌ప్రెస్' మీద వెళ్తోంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  న్యూఢిల్లీ, మార్చి 25 (తెలుగుప్రభ): పార్లమెంట్ బడ్జెట్ ...