- ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ అత్యవసర భేటీ
- సరఫరా గొలుసు దెబ్బతినకుండా చూడాలని ఆదేశం
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం ఎదుర్కోబోయే సవాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ భేటీలో, యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తే మార్పులు భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల సరఫరాపై ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'టీమ్ ఇండియా' స్ఫూర్తితో కలిసి పనిచేస్తేనే ఈ క్లిష్ట పరిస్థితిని సమర్థవంతంగా అధిగమించగలమని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. సరఫరా గొలుసు (Supply Chain) ఎక్కడా దెబ్బతినకుండా చూడటమే కాకుండా, యుద్ధం సాకుతో అక్రమ నిల్వలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ముఖ్యమంత్రులను ఆదేశించారు.
ముఖ్యంగా ఇంధన భద్రత , ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ప్రధాని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల తలెత్తే అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర , జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్లను వెంటనే క్రియాశీలకం చేయాలని ఆయన సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సరిహద్దు , తీరప్రాంత రాష్ట్రాలు నౌకాయానం మరియు సముద్ర కార్యకలాపాలకు సంబంధించి ఎదురయ్యే సవాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాని నొక్కి చెప్పారు. సామాన్య పౌరుల ప్రయోజనాలను కాపాడటమే ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు వార్తలు, వదంతుల పట్ల ప్రధాని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కచ్చితమైన, విశ్వసనీయమైన సమాచారాన్ని అందించాలని రాష్ట్రాలకు సూచించారు. పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల క్షేమం కోసం కేంద్రం ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టిందని, వారికి సహాయం చేయడానికి రాష్ట్రాల్లో హెల్ప్లైన్ నంబర్లు , నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం తీసుకుంటున్న ముందస్తు చర్యలను ముఖ్యమంత్రులు ఈ సందర్భంగా అభినందించారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment