Saturday, 14 March 2026

అంబులెన్స్‌లో మూడుసార్లు గుండెపోటు


  • మొహమ్మద్ రఫీ చివరి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమైన కుమారుడు షాహిద్ రఫీ


భారతీయ చలనచిత్ర సంగీత శిఖరం, లెజెండరీ గాయకుడు మొహమ్మద్ రఫీ తుది శ్వాస విడిచిన ఆ విషాద క్షణాలను ఆయన కుమారుడు షాహిద్ రఫీ తాజాగా ఒక రియాలిటీ షోలో పంచుకున్నారు. ప్రముఖ సింగింగ్ షో 'ఇండియన్ ఐడల్' ప్రత్యేక ఎపిసోడ్‌కు అతిథిగా విచ్చేసిన ఆయన, తన తండ్రి మరణానికి ముందు ఏం జరిగిందనే విషయాలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. రఫీ గారు మరణించడానికి కేవలం రెండురోజుల ముందే లక్ష్మీకాంత్-ప్యారేలాల్ సంగీత దర్శకత్వంలో తన చివరి పాటను రికార్డ్ చేశారని, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఊహించని విధంగా ఉన్నాయని షాహిద్ వివరించారు.



షాహిద్ రఫీ తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన రోజున కూడా రఫీ గారు రిహార్సల్స్‌కు వెళ్లారు. అయితే రిహార్సల్ సమయంలోనే ఆయనకు ఛాతీలో స్వల్పంగా నొప్పి మొదలైంది. వెంటనే మందులు తీసుకున్నప్పటికీ, ఆయన భార్యకు అనుమానం వచ్చి డాక్టరును పిలిపించారు. పరిస్థితి విషమించడంతో ఆయన్ని వెంటనే మాహిమ్ నుంచి బాంబే హాస్పిటల్‌కు తరలించేందుకు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలోనే ఆయనకు వరుసగా మూడుసార్లు గుండెపోటు (హార్ట్ అటాక్) వచ్చిందని, ఆసుపత్రికి చేరుకునే లోపే కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఆయన కన్నుమూశారని డాక్టర్లు నిర్ధారించారని షాహిద్ ఆవేదనతో చెప్పారు.


ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ తనిష్క్ శుక్లా 'తు కహిన్ ఆస్ పాస్ హై' అనే పాటను పాడటంతో సెట్ అంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఆ పాట విన్న తర్వాత షాహిద్ రఫీ స్పందిస్తూ, అది తన తండ్రి పాడిన ఆఖరి పాట అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రఫీ గారితో సుదీర్ఘ అనుబంధం ఉన్న సీనియర్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ కూడా పాల్గొన్నారు. భారతీయ సంగీత స్వర్ణయుగాన్ని గుర్తుచేస్తూ సాగిన ఈ ఎపిసోడ్, రఫీ గారి అభిమానులకు మరోసారి ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసింది.

No comments:

Post a Comment

Featured post

ఇరాన్ 'కిరీటపు రత్నం' ఖార్గ్ ఐలాండ్‌పై దాడి

అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో ఎందుకిది అత్యంత కీలకం? పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఇరాన్‌కు చెందిన అత్యంత వ్యూహాత్మక ప్రాంతం '...