లెబనాన్లో ఇజ్రాయెల్ విధ్వంసం
బీరూట్లో హెజ్బొల్లా ఎలైట్ కమాండ్ సెంటర్ల ధ్వంసం
826కు చేరిన మరణాల సంఖ్య
దుబాయ్, మార్చి 15 : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లెబనాన్ రాజధాని బీరూట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు జరిపిన మెరుపు దాడుల్లో హిజ్బుల్లాకు చెందిన అత్యంత కీలకమైన 'ఎలైట్ కమాండ్ సెంటర్లు' పూర్తిగా నేలమట్టమయ్యాయి. హెజ్బొల్లా కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న ఈ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం శక్తివంతమైన క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల హెజ్బొల్లా వ్యూహాత్మక సామర్థ్యం దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. కొన్న రోజులుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ పోరాటంలో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజా నివేదికల ప్రకారం, ఇప్పటివరకు ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 826కు చేరుకోవడం అక్కడి పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ దాడులను ధృవీకరిస్తూ, సరిహద్దు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పౌరుల భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాద స్థావరాలను ఏరివేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. బీరూట్లోని నివాస ప్రాంతాల చాటున హెజ్బొల్లా తన కమాండ్ సెంటర్లను నడుపుతోందని, అందుకే కచ్చితమైన సమాచారంతో ఈ లక్షిత దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. అయితే, ఈ దాడుల వల్ల సామాన్య ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతుండటం పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో బీరూట్ వదిలి సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
మరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా హెజ్బొల్లా కూడా సరిహద్దు వెంబడి రాకెట్ దాడులను ముమ్మరం చేసింది. ఐక్యరాజ్యసమితి, ఇతర అగ్రదేశాలు కాల్పుల విరమణ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇరుపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో పరిస్థితి క్షణక్షణానికి మారుతుండటంతో, పశ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా ఈ వివాదంలోకి లాగబడతాయేమోనన్న భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
No comments:
Post a Comment