- చమురు సరఫరా ఆగిపోతే కీలక రంగాల్లో కుదుపు తప్పదు..
- మోర్గాన్ స్టాన్లీ నివేదికలో హెచ్చరిక!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కాకుండా, ఆసియా దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం వల్ల భారత్ సహా ఆసియాలోని అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కీలక రంగాలపై దీని ప్రభావం పడే అవకాశం ఉందని తన తాజా నివేదికలో పేర్కొంది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా, చమురు ,సహజ వాయువు (LNG) సరఫరాలో ఏర్పడే అంతరాయాలు ఉత్పత్తి , ఎగుమతులపై తీవ్రమైన 'నాక్-ఆన్' (గొలుసుకట్టు) ప్రభావాలను చూపుతాయని విశ్లేషించింది.
ముఖ్యంగా భారత్, థాయ్లాండ్, దక్షిణ కొరియా , తైవాన్ వంటి దేశాలు ఈ ఇంధన సంక్షోభం వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది. చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే అది కేవలం ఇంధనానికే పరిమితం కాకుండా.. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువులు, ఆటోమొబైల్ , సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన పెట్రో కెమికల్స్, హీలియం, సల్ఫర్ వంటి ముడి పదార్థాల లభ్యతను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల వస్తువుల తయారీ వ్యయం పెరగడమే కాకుండా, వినియోగదారులపై కూడా భారం పడుతుందని మోర్గాన్ స్టాన్లీ వివరించింది.
సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే కొన్ని ఆసియా దేశాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. భారత్ ఇప్పటికే ఎల్ఎన్జీ రేషనింగ్ను ప్రారంభించగా, దక్షిణ కొరియా ఇంధన పన్నులను తగ్గించింది. థాయ్లాండ్ వంటి దేశాలు ఇంధన పొదుపు కోసం తమ ప్రభుత్వ ఉద్యోగులను ఇంటి నుండే పనిచేయాలని (Work from home) ఆదేశించాయి. యుద్ధం మరికొంత కాలం కొనసాగితే, ఇంధన ఎగుమతులపై ఆంక్షలు మరియు మరిన్ని రంగాల్లో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది. రాబోయే వారాల్లో అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలను గమనిస్తే ఈ సంక్షోభ తీవ్రత ఎంతవరకు ఉంటుందో స్పష్టమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
No comments:
Post a Comment