- కేంద్రం సీరియస్.. నేటి సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని మమతా ప్రభుత్వానికి ఆదేశం!
న్యూఢిల్లీ/కోల్కతా: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దేశ ప్రథమ పౌరురాలి భద్రత , మర్యాదకు సంబంధించిన ఈ వ్యవహారంలో జరిగిన లోపాలపై సమగ్ర నివేదికను నేటి (ఆదివారం) లోపు సమర్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పాటించాల్సిన కనీస నిబంధనలు , భద్రతా ప్రోటోకాల్స్లో రాష్ట్ర యంత్రాంగం వైఫల్యం చెందినట్లు ప్రాథమిక సమాచారం అందడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రపతికి స్వాగతం పలికే సమయంలో , ఆమె పర్యటించిన బహిరంగ కార్యక్రమాల్లో అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని కేంద్రవర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తులు రాష్ట్రాలను సందర్శించినప్పుడు 'బ్లూ బుక్' నిబంధనల ప్రకారం కట్టుదిట్టమైన భద్రత , మర్యాదలు ఉండాలి. అయితే, బెంగాల్ పర్యటనలో అధికారిక ప్రోటోకాల్ జాబితాలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు గైర్హాజరు కావడం లేదా భద్రతా వలయంలోకి అనధికారిక వ్యక్తులు ప్రవేశించడం వంటి అంశాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్వర్గాలు ప్రాథమిక నివేదికను అందించగా, రాష్ట్ర ప్రభుత్వం తరపున వివరణ కోరుతూ అత్యవసర ఆదేశాలు జారీ అయ్యాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదిక సంతృప్తికరంగా లేకపోతే, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర-రాష్ట్రాల మధ్య ఇప్పటికే పలు అంశాలపై రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న తరుణంలో, రాష్ట్రపతి ప్రోటోకాల్ వివాదం మరింత వేడిని కలిగిస్తోంది.
No comments:
Post a Comment