- రంగంలోకి అమెరికా మిత్రదేశాలు..
- నౌకల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా భారీ వ్యూహం
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' రక్షణ కోసం ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ , కెనడా దేశాల అధినేతలు తాజాగా ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సముద్ర మార్గంలో నౌకల రాకపోకలను అడ్డుకోవడం, క్షిపణి , డ్రోన్ దాడులకు దిగడం వంటి చర్యలను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలని వారు హెచ్చరించారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని నిర్ధారించేందుకు తామంతా సమిష్టిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, ఇందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని అగ్రరాజ్యాలు ప్రకటించాయి.
ముఖ్యంగా నాటో (NATO) సభ్య దేశాలు ఈ విషయంలో అమెరికాకు సహకరించడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. కేవలం జపాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు నాటోలో సభ్యత్వం కలిగి ఉండటం విశేషం. చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలతో పాటు పౌర నౌకలపై దాడులు చేయడం అంతర్జాతీయ శాంతిభద్రతకు పెను ముప్పు అని ఈ దేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఈ జలసంధి గుండా ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు వాటా జరుగుతున్నందున, ఇక్కడ అంతరాయం కలిగితే ప్రపంచ ఆర్థికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఈ రక్షణ చర్యలు యుద్ధం కోసం కాదని ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ కూటమి రంగంలోకి దిగడం వల్ల సముద్రపు దొంగతనాలు , క్షిపణి దాడుల భయం లేకుండా నౌకలు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ పరిణామం చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలకు కొంత ఊరట కలిగించే అంశం. పరిస్థితులు చక్కబడితే అంతర్జాతీయ మార్కెట్లో క్రమంగా ఇంధన ధరలు స్థిరీకరించబడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
No comments:
Post a Comment