- రెండు రోజుల్లో రెండోసారి వాత
- గల్ఫ్ యుద్ధం ప్రభావంతో వాహనదారులపై అదనపు భారం
మధ్యప్రాచ్యంలో సాగుతున్న యుద్ధ వాతావరణం , అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న సంక్షోభం కారణంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో సీఎన్జీ (CNG) ధరలు మళ్లీ పెరిగాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కిలో సీఎన్జీపై మరో రూపాయిని పెంచుతూ ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL) నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండు రోజుల్లోనే సీఎన్జీ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు వాటా కలిగిన అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) జలసంధి మూతపడటంతో అంతర్జాతీయంగా గ్యాస్ కొనుగోలు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఈ పెరిగిన ఇన్పుట్ ఖర్చులు , అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వల్లే తాము స్వల్పంగా ధరలను సవరించాల్సి వచ్చిందని ఐజీఎల్ పేర్కొంది.
ఈ తాజా పెంపుతో మే 17 ఉదయం 6 గంటల నుంచి ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ. 80.09 కి చేరింది. అలాగే నోయిడా, ఘజియాబాద్లలో రూ. 88.70, గురుగ్రామ్లో రూ. 85.12, ముజఫర్నగర్, మీరట్, షామ్లీలలో రూ. 88.58 కి చేరింది. దేశంలోని ఇతర నగరాలైన కాన్పూర్లో రూ. 91.42, అజ్మీర్లో రూ. 89.44, బందాలో రూ. 86.42, , హాపూర్లో రూ. 89.70 గా కొత్త ధరలు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల కిందటే కేంద్ర ప్రభుత్వం దిల్లీలో సీఎన్జీపై రెండు రూపాయలు పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా సీఎన్జీ ధర కిలోకు రూ. 84 కి పెరిగింది. అంతర్జాతీయ సంక్షోభం కారణంగా దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు కూడా లీటరుకు సుమారు మూడు రూపాయల వరకు పెరగడం గమనార్హం. ఈ ధరల సవరణ తర్వాత కూడా ప్రత్యామ్నాయ ఇంధనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాల వల్ల దాదాపు 45 శాతం వరకు రన్నింగ్ కాస్ట్ ఆదా అవుతుందని ఐజీఎల్ స్పష్టం చేసింది.
సీఎన్జీ ధరల వరుస పెంపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్పై తీవ్ర ప్రభావం చూపించనుంది, ఇది చివరికి సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారంగా మారనుంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో వేలాది ఆటోలు, క్యాబ్లు , బస్సులు సీఎన్జీతోనే నడుస్తుండటంతో, పెరిగిన ఇంధన భారాన్ని డ్రైవర్లు ప్రయాణికులపైకి నెట్టే అవకాశం ఉంది. ముంబైలో ఆటో సంఘాలు అప్పుడే కనీస ఛార్జీని ఒక రూపాయి పెంచాలని డిమాండ్ చేయడం ప్రారంభించాయి. ఈ రవాణా ఖర్చులు పెరగడం వల్ల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులు కానుంది. గల్ఫ్ సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు రోజుకు దాదాపు రూ. 1,600 కోట్ల భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నష్టాలు పెరుగుతున్నప్పటికీ, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ధరలను పెంచకుండా నియంత్రిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంధనాన్ని ఆదా చేయాలని, ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ (ఉద్యోగాలు ఇంటి నుండి చేయడం) వైపు మొగ్గు చూపాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపునకు మద్దతుగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కూడా ప్రకటించారు.
No comments:
Post a Comment