- నిరంతర నిఘా, దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను, ఎబోలా వ్యాప్తి తీవ్రతను తాము నిరంతరం నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. అయితే, ఈ భయంకరమైన వైరస్ పట్ల దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటివరకు భారతదేశంలో ఎబోలాకు సంబంధించిన ఒక్క పాజిటివ్ లేదా ధ్రువీకరించబడిన కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులలో నిఘాను మరింత కఠినతరం చేసినట్లు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే గట్టి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా పటిష్టమైన నిబంధనలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎబోలా వంటి అత్యంత వేగంగా వ్యాపించే అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పరిశోధనా సంస్థలు, ప్రయోగశాలలు (ల్యాబ్లు) సంసిద్ధంగా ఉన్నాయని, అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే ఐసోలేట్ చేయడానికి అవసరమైన అన్ని వైద్య వసతులను సిద్ధం చేసినట్లు కేంద్రం భరోసా ఇచ్చింది.
No comments:
Post a Comment