Wednesday, 27 May 2026

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్


  • 8వ వేతన సంఘంలో 400 శాతం జీతాల పెంపుతో కూడిన సరికొత్త 'ఫిట్మెంట్ ఫార్ములా' ప్రతిపాదన!


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణ కోసం వేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission) కసరత్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక సాధారణ జీతాల పెంపు ప్రక్రియలా కాకుండా.. ప్రభుత్వ ఖజానాపై పడే భారం, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల మధ్య జరుగుతున్న పెద్ద చర్చగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల దృష్టిని ఆకర్షిస్తున్న ఒక సంచలన ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. కొందరు సీనియర్స్థాయి అధికారుల జీతాలను ఏకంగా 400 శాతానికి పైగా పెంచేలా సరికొత్త వేతన సవరణ ఫార్ములాను ఒక ప్రముఖ ఉద్యోగ సంఘం ప్రతిపాదించింది.



వేతన సంఘంతో జరుగుతున్న సంప్రదింపుల్లో భాగంగా ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్‌వైజర్స్ అసోసియేషన్ (IRTSA) ఈ కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. గత వేతన సంఘాల మాదిరిగా దేశంలోని ఉద్యోగులందరికీ ఒకే రకమైన 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' (గుణకం) ఉంచే పాత పద్ధతికి స్వస్తి పలికి.. విభిన్న పే-లెవెల్స్ ఆధారంగా ఐదు రకాల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను వర్తింపజేయాలని కోరింది. ఈ నూతన ప్రతిపాదన ప్రకారం లెవెల్ 1 నుండి 5 వరకు ఉన్న ఉద్యోగులకు 2.92, లెవెల్ 6 నుండి 8 కి 3.50, లెవెల్ 9 నుండి 12 కి 3.80, లెవెల్ 13 నుండి 16 కి 4.09, అలాగే అత్యున్నత కేటగిరీ అయిన లెవెల్ 17 , 18 ఉద్యోగులకు 4.38 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రతిపాదించారు.


ఈ వినూత్న ఫార్ములాను గనుక ప్రభుత్వం అంగీకరిస్తే ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఉదాహరణకు లెవెల్ 17-18 లో రూ. 2.5 లక్షల ప్రాథమిక వేతనం (Basic Pay) తీసుకునే ఒక సీనియర్ అధికారి జీతం.. కొత్త గుణకం ప్రకారం ఏకంగా రూ. 10.95 లక్షలకు చేరుకుంటుంది. అలాగే మధ్యతరగతి ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరుగుతాయి. లెవెల్ 6-8 లో రూ. 45,000 బేసిక్ పే ఉన్నవారి జీతం ఒక్కసారిగా రూ. 1.57 లక్షలకు మారుతుంది. జూనియర్, సీనియర్ ఉద్యోగుల మధ్య, ముఖ్యంగా రైల్వే రక్షణ విభాగాల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే టెక్నికల్ సిబ్బంది జీతాల మధ్య ఉన్న వ్యత్యాసాలను తగ్గించడానికే ఈ డిమాండ్ చేస్తున్నట్లు అసోసియేషన్ స్పష్టం చేసింది. దీనితో పాటు టెక్నికల్ స్టాఫ్ కోసం ప్రత్యేక పే-స్ట్రక్చర్, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, వేతన సవరణకు ముందే 50 శాతం కరువు భత్యాన్ని (DA) బేసిక్ పేలో విలీనం చేయాలని కూడా డిమాండ్ చేశారు.


ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 గా ఉంది. కాగా, ఇప్పుడు వేర్వేరు యూనియన్లు కనీస బేసిక్ పేను రూ. 69,000 నుండి రూ. 72,000 వరకు పెంచాలని ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, ఇంత భారీ మొత్తంలో జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెంచితే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా పడే ఆర్థిక భారం, ద్రవ్యోల్బణ ముప్పుపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగి కుటుంబ పరిధిని 3 నుండి 5 యూనిట్లుగా మార్చాలనే డిమాండ్‌తో పాటు, పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లోనే కనీస పెన్షన్ గ్యారెంటీ కల్పించాలనే అంశాలపై కూడా గట్టి చర్చ నడుస్తోంది. జస్టిస్ (రిటైర్డ్) రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం ఇప్పటికే దిల్లీతో పాటు ఒడిశా, లక్నో, హైదరాబాద్, శ్రీనగర్ వంటి నగరాల్లో ఉద్యోగ సంఘాలతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతోంది. ఈ కమిషన్ నిర్ణయాలు దేశంలోని కోటి పది లక్షల మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

No comments:

Post a Comment

Featured post

నన్ను ఎవరూ తొలగించలేదు, అవన్నీ వదంతులే

ప్రధాని మోడీపై వ్యాఖ్యల వల్లే 'ఇండియన్ ఐడల్ 16' నుంచి అవుట్ అన్న వార్తలపై విశాల్ దద్లానీ క్లారిటీ ముంబై: ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శక...