- టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఏఐఏడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మళ్లీ ఈపీఎస్ గూటికి
- అనర్హత వేటు పిటిషన్ ఉపసంహరణ!
చెన్నై: రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏదైనా జరగొచ్చు అనడానికి తమిళనాడు తాజా పరిణామాలే నిదర్శనం. కేవలం రెండు వారాల వ్యవధిలోనే అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో తీవ్ర విభేదాలు, విడాకులు, ఆ తర్వాత నాటకీయ రీతిలో రాజీ కుదిరిపోయాయి. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) కి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేసి, అసెంబ్లీ బలపరీక్షలో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన రెబెల్ ఎమ్మెల్యేలు అంతా తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం నాడు ఈపీఎస్ వర్గం, తిరుగుబాటు నేతలు కలిసి ఉమ్మడిగా అసెంబ్లీ స్పీకర్ను కలిసి తామంతా మళ్లీ ఒకే పార్టీగా ఒక్కటయ్యామని అధికారికంగా స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ ఐక్యంగానే ఉంటామని, పార్టీ పట్ల తమకు పూర్తి విధేయత ఉందని రెబెల్ ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా ప్రకటించారు. తిరుగుబాటుదారులు వెనక్కి తగ్గడంతో, వారిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ కార్యాలయానికి అంతకుముందు పళనిస్వామి సమర్పించిన దరఖాస్తును ఆయన తక్షణమే ఉపసంహరించుకున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో మాజీ మంత్రి సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అధికార టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇద్దామన్న ఈ వర్గం ప్రతిపాదనను ఈపీఎస్ పూర్తిగా తిరస్కరించినప్పటికీ.. దాదాపు 25 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరించి మరీ మే 13న విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీనితో ఆగ్రహించిన పళనిస్వామి వారందరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్కు లేఖ రాశారు. అయితే, స్పీకర్ వద్ద ఈ ప్రక్రియ పెండింగ్లో ఉండగానే.. తిరుగుబాటు బృందం నుండి నలుగురు ఎమ్మెల్యేలు హఠాత్తుగా తమ పదవులకు రాజీనామా చేసి అధికార టీవీకే పార్టీలో చేరిపోవడంతో రెబెల్స్ క్యాంప్కు మొదటి షాక్ తగిలింది. స్పీకర్ నిర్ణయం రాకముందే వారు రాజీనామా చేయడాన్ని ఈపీఎస్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు.
ఈ పరిణామాల మధ్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తమ పదవులు ఎక్కడ ఊడిపోతాయోనన్న భయంతో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటనే యూ-టర్న్ తీసుకుని పళనిస్వామి క్యాంప్నకు వచ్చేసారు. బలపరీక్షలో విప్ ధిక్కరించినందుకు స్పీకర్కు, పార్టీ అధినేతకు క్షమాపణ లేఖలు సమర్పించారు. దీనితో రెబెల్స్ బలం 25 నుండి ఒక్కసారిగా 15కి పడిపోవడంతో తిరుగుబాటు నీరుగారిపోయింది. మరో దారి లేక రెబెల్ గ్రూప్ టాప్ లీడర్ ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని బృందం పళనిస్వామి నివాసానికి వెళ్లి ఆయనతో సంధి చర్చలు జరిపింది. ఎడప్పాడి పళనిస్వామి మాత్రమే తమ ఏకైక నాయకుడని వారు బహిరంగంగా ప్రకటించారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల వల్లే తాము తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు సమస్యలన్నీ సర్దుకున్నాయని, తమ డిమాండ్లను పరిశీలించడానికి పళనిస్వామి అంగీకరించారని నేతలు స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామంతో అన్నాడీఎంకే పార్టీపై ఈపీఎస్ తన పట్టును మరోసారి నిరూపించుకుని తిరుగులేని బాస్గా నిలిచారు.
No comments:
Post a Comment