- ఆ ప్రచారంలో ఇసుమంతైనా నిజం లేదు.. పుకార్లను పూర్తిగా కొట్టిపారేసిన పీఎంవో
పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన పొదుపు చర్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించబోతోందంటూ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఆ వార్తలలో ఏమాత్రం వాస్తవం లేదని, అవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు లేదా ప్రముఖుల విదేశీ పర్యటనలపై ప్రభుత్వం ఎలాంటి నియంత్రణలు లేదా ఆంక్షలను విధించడం లేదని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని పీఎంవో దేశ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ఇంధన ఆదా కోసం ప్రధాని మోదీ ఇటీవల ఇచ్చిన పిలుపును కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు తప్పుగా వాడుకుంటూ.. ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలను పరిమితం చేయబోతోందనే వాతావరణాన్ని సృష్టించాయి. ఈ ప్రచారంపై ప్రధాని స్పందిస్తూ.. "ఆ నివేదికలలో ఇసుమంతైనా నిజం లేదు" (Not an iota of truth) అని తీవ్రంగా కొట్టిపారేశారు. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరుగుతున్న మాట వాస్తవమేనని, అందుకే దేశీయంగా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, వర్క్ ఫ్రమ్ హోమ్, కార్-పూలింగ్ వంటి పద్ధతుల ద్వారా ఇంధనాన్ని పొదుపు చేయాలని మాత్రమే తాము కోరామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వ విభాగాలు తమ అంతర్గత అధికారిక ప్రయాణాలను ,భౌతిక సమావేశాలను తగ్గించుకోవాలని సూచించామే తప్ప, పౌరుల వ్యక్తిగత లేదా విదేశీ ప్రయాణ స్వేచ్ఛపై ఎలాంటి ఆంక్షలు పెట్టలేదని కేంద్రం స్పష్టమైన ప్రకటనతో ఈ వివాదానికి తెరదించింది.
No comments:
Post a Comment