Wednesday, 27 May 2026

భారత క్రీడా రంగంలో తీరని లోటు

 భారత క్రీడా రంగంలో తీరని లోటు

 ఆసియా క్రీడల తొలి షూటింగ్ స్వర్ణ విజేత, దిగ్గజ క్రీడా అడ్మినిస్ట్రేటర్ రాజా రణధీర్ సింగ్ కన్నుమూత!


న్యూఢిల్లీ: భారత క్రీడా ప్రపంచంలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. భారతదేశం గర్వించదగ్గ షూటింగ్ దిగ్గజం, ఒలింపియన్ మరియు అంతర్జాతీయ క్రీడా నిర్వాహకుడు రాజా రణధీర్ సింగ్ (79) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, దిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన నివాసంలోనే బుధవారం (మే 27, 2026) ఆఖరి శ్వాస విడిచారు. ఆసియా క్రీడల (Asian Games) చరిత్రలో షూటింగ్ విభాగంలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించిన  వీరుడిగా రణధీర్ సింగ్ క్రీడా చరిత్రలో నిలిచిపోయారు. ఆయన మరణవార్తను నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) సెక్రటరీ జనరల్ రాజీవ్ భాటియా తీవ్ర విచారంతో అధికారికంగా ధ్రువీకరించారు. రణధీర్ సింగ్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులు, ప్రముఖులు తీవ్ర సెంతాపాన్ని ప్రకటిస్తున్నారు.



పటియాలా రాజకుటుంబానికి చెందిన రణధీర్ సింగ్.. కేవలం మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా క్రీడల అభివృద్ధికి దశాబ్దాల పాటు నిరుపమానమైన సేవలు అందించారు. 1978లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా క్రీడల 'ట్రాప్ షూటింగ్' విభాగంలో ఆయన సాధించిన స్వర్ణ పతకం.. భారత షూటింగ్ రంగానికి ఒక సరికొత్త దిశను చూపింది. ఆ ఘనతకు గానూ 1979లో ఆయన ప్రతిష్టాత్మక 'అర్జున అవార్డు'ను అందుకున్నారు. ఒక అథ్లెట్‌గా ఆయన ఏకంగా ఐదుసార్లు ఒలింపిక్స్ (1968 మెక్సికో, 1972 మ్యూనిచ్, 1976 మాంట్రియల్, 1980 మాస్కో, 2014 లాస్ ఏంజెల్స్) లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు. 1994లో క్రీడా జీవితం నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, ఆయన క్రీడా పరిపాలనా రంగంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ స్థాయిలో భారత్ కీర్తిని ఇనుమడింపజేశారు.


ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) సెక్రటరీ జనరల్‌గా సుదీర్ఘకాలం పనిచేసిన రణధీర్ సింగ్, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (IOC) లో కూడా కీలక సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2024లో ఆయన ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (OCA) అధ్యక్షుడిగా ఎన్నికై, ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. అయితే, ఇటీవలి కాలంలో ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారతదేశంలో 2010 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించడంలో కూడా ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. రణధీర్ సింగ్ క్రీడా వారసత్వాన్ని ఆయన కుమార్తె రాజేశ్వరి సింగ్ కూడా కొనసాగిస్తూ ట్రాప్ షూటింగ్‌లో అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నారు. రణధీర్ సింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, భారత మరియు ఆసియా క్రీడారంగంలో ఆయన వదిలివెళ్లిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిదని క్రీడా వర్గాలు కొనియాడాయి.

No comments:

Post a Comment

Featured post

లార్డ్స్ టెస్టులో టీమిండియా చరిత్రాత్మక విజయం

ఇంగ్లాండ్‌ను 270 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ పరాజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు హెథర్ నైట్, టామీ బ్యూమాంట్ వీడ్కోలు లండన్:  ఐకానిక్ లార్డ్...