- అగ్రనేతల రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంది? కొందరికి సీఎం పీఠాలు
- కేంద్ర పదవులు.. మరికొందరికి రాజకీయ అజ్ఞాతవాసం!
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న మాజీ ముఖ్యమంత్రులు ,అగ్రనేతల రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు (Mixed Bag) కనిపిస్తున్నాయి. అశోక్ చవాన్ వంటి సీనియర్ నేత ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన తరుణంలో, సిద్ధాంతాలను పక్కనబెట్టి 'కమలం' గూటికి చేరిన నాయకులందరికీ రాజకీయంగా సమానమైన ప్రయోజనాలు దక్కలేదని విశ్లేషణలు చెప్తున్నాయి. కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రుల సుదీర్ఘ జాబితాలో అమరీందర్ సింగ్, దిగంబర్ కామత్, ఎస్.ఎం. కృష్ణ, విజయ్ బహుగుణ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్.డి. తివారీ, జగదాంబికా పాల్, , పెమా ఖండూ వంటి హేమాహేమీలు ఉన్నారు. అయితే, ఈ వలసల వల్ల అటు సదరు నాయకులకు, ఇటు బీజేపీకి ఎలాంటి లాభనష్టాలు చేకూరాయనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఈ జాబితాలో అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం పెమా ఖండూ రూటే వేరు. ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భారీగా చీల్చి రాష్ట్రంలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీని సాధించి పెట్టడమే కాకుండా, అప్పటి నుండి ఇప్పటివరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయవంతంగా కొనసాగుతున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం ఎన్.డి. తివారీ తన రాజకీయ జీవితం చివరి దశలో కేవలం తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీలో చేరారు, ఆ తర్వాత కొద్దిరోజులకే ఆయన కన్నుమూశారు. కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం. కృష్ణ కూడా వయోభారం, స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల బీజేపీలో చేరినప్పటికీ క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్ వీడి వచ్చిన పలువురు మాజీ ముఖ్యమంత్రులపై అప్పట్లో ఉన్న అవినీతి, ఈడీ కేసులు కూడా వారు బీజేపీలో చేరిన తర్వాత పూర్తిగా నిష్క్రియం అయిపోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ, ఈ స్థాయి నేతల చేరికలు దేశవ్యాప్తంగా బీజేపీకి ఒక పొలిటికల్ మైలేజ్ లేదా 'బజ్' క్రియేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ప్రస్తుతం బీజేపీలో పెద్దగా యాక్టివ్గా లేరు. వారసత్వ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేసే బీజేపీలో ఉంటూనే.. ఆయన తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తెను నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం విజయ్ బహుగుణ మాత్రం లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఉత్తరాఖండ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు, ఆయన కుమారుడు ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పదవి అనుభవిస్తున్నారు. ఈ మాజీ సీఎంల కథ ఇలా ఉంటే, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మారిన హిమంత బిశ్వ శర్మ (అసోం), బీరెన్ సింగ్ (మణిపూర్), మాణిక్ సాహా (త్రిపుర)ల కథలు పూర్తిగా భిన్నమైనవి , అత్యంత విజయవంతమైనవి. అసోంలో తరుణ్ గొగోయ్ సీఎంగా ఉన్నప్పుడు హిమంతకు సీఎం పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్ఠానం మాట తప్పడంతో, ఆయన బీజేపీలో చేరి 2021 ఎన్నికల తర్వాత అసోం ముఖ్యమంత్రి అయ్యారు. బీరెన్ సింగ్ కూడా కాంగ్రెస్ నుండి వచ్చి 2017లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. మణిపూర్లో గత ఏడాది కాలంగా తీవ్ర హింసాకాండ సాగుతున్నా, ఆయనను పదవి నుండి దించాలని డిమాండ్లు వస్తున్నా అధిష్ఠానం ఆయనను సీఎం పీఠంపైనే కొనసాగిస్తోంది. త్రిపురలో సీపీఎం సుదీర్ఘ పాలన వల్ల మాణిక్ సాహాకు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎలాంటి అవకాశం రాలేదు, కానీ ఆయన బీజేపీలోకి మారిన తర్వాత 2023లో విప్లవ్ కుమార్ దేవ్ స్థానంలో త్రిపుర ముఖ్యమంత్రిగా అదృష్టాన్ని వరించారు.
మాజీ ముఖ్యమంత్రులే కాకుండా, రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తులుగా ఉన్న యువ కేంద్ర మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్.పి.ఎన్. సింగ్లు కూడా కాంగ్రెస్ కు హ్యాండ్ ఇచ్చి బీజేపీలో చేరారు. వీరిలో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలక పాత్ర పోషించిన సింధియాకు కేంద్రంలో పౌర విమానయాన, ఉక్కు శాఖల మంత్రి పదవి లభించడమే కాకుండా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతుదారులకు పెద్ద ఎత్తున టికెట్లు ఇప్పించుకోగలిగారు. జితిన్ ప్రసాద యూపీలోని యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా, ఆర్.పి.ఎన్. సింగ్కు ఇటీవల ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సీటు లభించింది. మొత్తం వలస నేతల జాబితాలో హిమంత బిశ్వ శర్మ, జ్యోతిరాదిత్య సింధియాలు మాత్రమే బీజేపీలో చేరి అత్యధిక రాజకీయ లబ్ధిని, అధికార ప్రాధాన్యాన్ని పొందారని చెప్పవచ్చు. హిమంత బిశ్వ శర్మ అయితే ఏకంగా ఈశాన్య రాష్ట్రాలకే కాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీకి ఒక పవర్ఫుల్ పొలిటికల్ మేనేజర్గా ఎదిగారు. వీరే కాకుండా, శివసేన నుంచి వచ్చిన మాజీ సీఎం నారాయణ్ రాణే ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉండగా, జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి బాబులాల్ మరాండీ తిరిగి సొంతగూడు బీజేపీలోకి వచ్చి ప్రస్తుతం ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, బీజేపీ ప్రధాన ముఖచిత్రంగా వ్యవహరిస్తున్నారు.
No comments:
Post a Comment