- ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: భారతదేశం ఇప్పుడు వేగంగా సంస్కరణలు , స్పష్టమైన లక్ష్యంతో 'పూర్తిస్థాయి రిఫార్మ్ ఎక్స్ప్రెస్' దశలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ..ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యాన్ని వివరించారు. తమ ప్రభుత్వ సంస్కరణలు కేవలం ఆర్థిక లేదా ఆదాయంపై దృష్టి సారించకుండా, పూర్తిగా పౌర-కేంద్రీకృతమైనవని ప్రధాని అన్నారు ప్రజలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వారి రోజువారీ అడ్డంకులను తొలగించడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలిపారు.
- ఎంపీలకు సూచన
సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న నిజమైన సమస్యలను చురుకుగా గుర్తించి పంచుకోవాలని ప్రధాని ఎంపీలను కోరారు. తద్వారా 'రిఫార్మ్ ఎక్స్ప్రెస్' ప్రతి ఇంటికి చేరుకొని, రోజువారీ కష్టాలను తొలగించగలదని అన్నారు. 30-40 పేజీల ఫారమ్ల సంస్కృతిని, అనవసరమైన పత్రాల పునరావృత సమర్పణను అంతం చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. పౌరులకు సేవలను వారి ఇంటి వద్దకే అందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పౌరులను నమ్మి, స్వీయ-ధృవీకరణకు అనుమతి ఇవ్వడం పదేళ్లుగా విజయవంతమైందని, దుర్వినియోగం కాలేదని ప్రధాని గుర్తు చేశారు. జీవన సౌలభ్యం, వ్యాపార సౌలభ్యం రెండూ తమ ఎన్డీఏ ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యాలు అని ఆయన స్పష్టం చేశారు.
- ఇండిగో ఇబ్బందులపై ప్రధాని ఆదేశం
ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్ విమానాల రద్దుతో ప్రయాణికులు ఎదుర్కొన్న గందరగోళంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎంపీలను కోరారు. వ్యవస్థను సరిదిద్దడానికి చట్టాలు ఉండాలి తప్ప, ప్రజలను వేధించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్ సహా పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు.
No comments:
Post a Comment